వైసీపీ ఎంపీతో జలీల్ ఖాన్: ఏం జరుగుతోంది?
Jaleel Khan: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో విజయవాడ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తోన్నాయి. తెలుగుదేశం పార్టీలో మరో వికెట్ పడొచ్చనే ప్రచారం జరుగుతోంది. టీడీపీని వీడుతున్న సీనియర్ నాయకుల జాబితాలో మరో పేరు చేరుతుందని అంటున్నారు.
ఇప్పటికే విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని, కేశినేని శ్వేత, తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగండ్ల స్వామిదాస్.. ఇలా టీడీపీకి గుడ్బై చెప్పారు. ఈ ముగ్గురూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలుకుతున్నారు. నూజివీడు ఇన్ఛార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కూడా టీడీపీకి రాజీనామా చేశారు. ఆయన ఏ పార్టీలో చేరుతారనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఈ పరిస్థితుల్లో విజయవాడకే చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు జలీల్ ఖాన్.. వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. విజయవాడలో ఉన్న అయోధ్య రామిరెడ్డి కార్యాలయంలో ఆయనను కలుసుకున్నారు జలీల్ ఖాన్.
దీనికి సంబంధించిన ఓ ఫొటో.. సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎన్నో అనుమానాలను రేకెత్తించింది. గతంలో కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి గెలిచారాయన. 2014లో విజయం సాధించిన తరువాత పార్టీ ఫిరాయించారు. వైసీపీకి గుడ్బై చెప్పి, టీడీపీ కండువాను కప్పుకొన్నారు.
2024 ఎన్నికల్లో టీడీపీ టికెట్ను ఆశిస్తోన్నారు. తనకు లేదా తన కుటుంబానికి విజయవాడ వెస్ట్ సీటు ఇవ్వాలనేది ఆయన డిమాండ్. ఇది నెరవేరేలా కనిపించట్లేదు. పొత్తు ఉన్న నేపథ్యంలో ఈ నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో పోతిన మహేష్ పోటీ చేయొచ్చని తెలుస్తోంది.
జలీల్ ఖాన్కు టికెట్ దక్కే అవకాశాలు అంతంతమాత్రమేనంటూ సమాచారం అందుతున్న నేపథ్యంలో ఆయన ఆళ్ల అయోధ్య రామిరెడ్డిని కలుసుకోవడం చర్చనీయాంశమైంది. మళ్లీ సొంతగూటికి చేరుకుంటారనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.












Click it and Unblock the Notifications