మద్యం షాపుల్లో రూపాయికి 20 పైసలు ఇవ్వాల్సిందే: అభివృద్ధికి కట్టుబడి
JC Prabhakar Reddy: మొన్నటి వరకు ఇసుక వివాదంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఇప్పుడు మద్యం దుకాణాల టెండర్ల వ్యవహారంలో చిక్కుకుంది.
రాష్ట్రంలో ఇష్టారాజ్యంగా ఇసుకను దోపిడీ చేస్తోన్నారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమౌతోన్న విషయం తెలిసిందే. ట్రాక్టర్లు, లారీల డ్రైవర్లు, యజమానుల నుంచి కమీషన్లను దండుకుంటోన్నారంటూ ఆరోపణలు రోజురోజుకూ వెల్లువెత్తుతోన్నాయి. ఉచిత ఇసుక పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారంటూ జనం మండిపడుతున్నారు.

తెలుగుదేశం పార్టీకే చెందిన సీనియర్ నాయకుడు, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పలుమార్లు ఇసుక వివాదంపై స్పందించారు. ఇసుక విషయంలో జరుగుతున్న పరిణామాల పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తాను ఒప్పుకోనేది లేదని తేల్చి చెప్పారు.
తాజాగా ఇప్పుడు అదే జేసీ ప్రభాకర్ రెడ్డి మద్యం దుకాణాల అంశంపై స్పందించారు. ఓ వీడియోను విడుదల చేశారు. ఎవరు మద్యం షాపులు పెట్టుకున్నా ప్రతి మండలానికి రూపాయికి 15 పైసలు చొప్పున కమీషన్ ఇవ్వాల్సిందేనని చెప్పారు. ఆ షాపులకు తానే పెట్టుబడి పెడతానని, తనకు రూపాయికి 20 పైసలు ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఈ డబ్బులతో తాడిపత్రి నియోజకవర్గం అభివృద్ధికి ఖర్చు చేస్తానని తేల్చి చెప్పారు. 15 శాతం ఇవ్వక తప్పదనీ కుండబద్దలు కొట్టారు. తాను ఎమ్మెల్యేలను ఎంతగానో గౌరవిస్తానని, తన నియోజకవర్గం తాడిపత్రిలో జోక్యం చేసుకుంటే మాత్రం ఏ మాత్రం సహించబోనని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. ఓ ఎమ్మెల్యేను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారాయాన.
తన నియోజకవర్గంలో ఎలా వచ్చారంటూ నిలదీశారు. వారి అవినీతిపై సీబీఐతో విచారణ జరిపిస్తానని సవాల్ చేశారు. నేను నీ నియోజరవర్గంలో జోక్యం చేసుకున్నానా? అంటూ ప్రశ్నించారు. తనకు మద్యం దుకాణాలు, ఇసుక రీచ్ల అవసరమే లేదని, నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసుకోవడమే తన ప్రధాన కర్తవ్యమని జేసీ చెప్పారు.

దీనికోసం ఇప్పటికీ బ్యాంక్లో మూడు కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. వచ్చే సంవత్సరం డిసెంబర్ నాటికి 10 కోట్ల రూపాయల మేర ఆదాయం వచ్చేలా తన సొంత నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని జేసీ అన్నారు. ఇసుక అమ్ముకుంటూ, పేకాట క్లబ్బులు నడిపించుకునే వాళ్లు తన నియోజకవర్గంలో జోక్యం చేసుకుంటే సహంచనని చెప్పారు.
1952లో తొలిసారిగా తన తండ్రి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారని, అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రజలు తమను ఆదరిస్తూనే వస్తోన్నారని జేసీ గుర్తు చేశారు. అలాంటి తాడిపత్రి నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. సొంతానికి ఒక్క పైసా కూడా వద్దని, నియోజకవర్గం అభివృద్దికే నిధులను ఖర్చు చేస్తానని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications