పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ రెండోస్థానం: టీడీపీ కౌంటర్: రూ.65 వేల కోట్లు మా హయాంలోనే: పట్టాభి
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తెలుగుదేశం సీనియర్ నాయకుడు, అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి రామ్.. మరోసారి ఘాటు విమర్శలతో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో విధ్వంసకర పాలనకు నాంది పలికి నేటితో రెండేళ్లు పూర్తయిందంటూ ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన ప్రజా వేదిక కూల్చివేత రెండేళ్లు పూర్తి చేసుకున్న రోజే- రాష్ట్రం నుంచి రిలయన్స్ తరలి వెళ్లిందంటూ వార్తలొచ్చాయని గుర్తు చేశారు. ప్రజా వేదికను కూల్చివేయడంతోనే పరిశ్రమలన్నీ తరలి వెళ్లిపోవడానికి బీజం పడిందని విమర్శించారు.
MAA elections 2021: మెగా కాంపౌండ్ కీ రోల్: చిరంజీవి సపోర్ట్ ఎవరికో తేల్చేసిన నాగబాబు
వేరే రాష్ట్రాలకు..
కొద్దిసేపటి కిందట ఆయన జూమ్ వీడియో ద్వారా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రిలయన్స్ యాజమాన్యం రాష్ట్రం నుంచి తరలి వెళ్లడానికి జగన్ సర్కార్ అసమర్థ పాలనే కారణమని ధ్వజమెత్తారు. వైసీపీ పాలనతో రాష్ట్రానికి శని పట్టినట్టయిందని మండిపడ్డారు. తమ పరిపాలనలో ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీలన్నీ ఇప్పుడు వేరే రాష్ట్రాలకు తరలి వెళ్తోన్నాయని పట్టాభి రామ్ విమర్శించారు. ఏషియన్ పేపర్ అండ్ పల్ప్ వంటి విదేశీ కంపెనీలు పరార్ అవుతున్నాయని అన్నారు. వైసీపీ నేతల బెదిరింపులు, కమీషన్ల వల్ల ఒక్క విదేశీ పెట్టుబడి కూడా రాష్ట్రానికి రావాట్లేదని చెప్పారు.
విదేశీ కంపెనీలు ఏమయ్యాయ్..
రిలయన్స్, లులు, ఫ్రాంక్లిన్ అండ్ టెంపుల్టన్, అదానీ వంటి అనేక సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చి మరీ.. వెనక్కి వెళ్లాయని పట్టాభిరామ్ అన్నారు. మహారాష్ట్ర, జార్ఖండ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక వంటి అనేక రాష్ట్రాలు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించాయని, ఏపీలో మాత్రం ఆ పరిస్థిితి లేదని చెప్పారు. రాష్ట్రానికి మూడు శాతం మాత్రమే పెట్టుబడులు వచ్చాయని, అది కూడా చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాల ఫలితమేనని అన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్న 2014 నుంచి 2019 మధ్యకాలంలో 65 వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని పట్టాభి అన్నారు. ప్రజా వేదిక కూల్చివేతతోనే విధ్వంసకర పాలన శ్రీకారమైందని, రెండేళ్ల తరువాత కూడా అది కొనసాగుతోందని విమర్శించారు.
దిక్కుమాలిన జాబ్ క్యాలెండర్
ఇది చాలదన్నట్లు నిరుద్యోగ యువతను మరింత అసహనానికి గురి చేసేలా దిక్కుమాలిన జాబ్ క్యాలెండర్ను వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిందని పట్టాభి రామ్ విమర్శించారు. జాబ్ క్యాలెండర్ తరువాత యువత ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తోన్నారని, వారికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని అన్నారు. విశాఖపట్నం, అనంతపురం వంటి పలు నగరాల్లో నిరుద్యోగులు రోడ్డెకెక్కి, ఆందోళనలను చేపట్టారని గుర్తు చేశారు. ఇవన్నీ విధ్వంసకర పాలనకు నిదర్శనాలేనని అన్నారు. వైఎస్ జగన్ పాలన మీద దృష్టి పెట్టకుండా.. తమ ప్రభుత్వం రూపొందించిన మంచి పథకాలను రద్దు చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు.