టిడిపికి షాక్: జగన్ను కలిసిన దేశం నేత వేనాటి సుమంత్ రెడ్డి
Recommended Video

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా సూళ్ళూరు పేట మున్సిఫల్ కౌన్సిలర్, టిడిపి నేత వేనాటి సుమంత్ రెడ్డి వైఎస్ జగన్ను కలవడం రాజకీయంగా కలకలం రేపుతోంది. అయితే వేనాటి కుటుంబం టిడిపితోనే ఉంటుందని రామచంద్రారెడ్డి ప్రకటించారు. కానీ, సుమంత్ రెడ్డి వైఎస్ జగన్ను కలిసిన విషయమై మాట్లాడేందుకు మాత్రం నిరాకరించడం మాత్రం చర్చనీయాంశంగా మారింది.
నెల్లూరు జిల్లాలో వైసీపీ ఆధిపత్యానికి గండికొట్టేందుకు టిడిపి ప్లాన్ చేస్తోంది.అయితే వైసీపీ కూడ టిడిపి ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. నెల్లూరు జిల్లాలోని టిడిపి అసంతృప్త నేతలకు గాలం వేసేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది.
నెల్లూరు జిల్లాలో టిడిపి నేత వేనాటి సుమంత్ రెడ్డి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ను కలవడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకొంది. అయితే పార్టీ నాయకత్వం వేనాటి కుటుంబాన్ని పట్టించుకోవడం లేదనే కారణంగానే సుమంత్ రెడ్డి అసంతృప్తి చెందాడా ఇతరత్రా కారణాలున్నాయా అనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సుమంత్ రెడ్డి వైఎస్ జగన్ ను ఎందుకు కలిశారనే విషయమై కూడ టిడిపిలో చర్చ సాగుతోంది.

టిడిపికి షాకిచ్చిన వేనాటి సుమంత్ రెడ్డి
నెల్లూరు జిల్లా పరిషత్లో టిడిపి ఫ్లోర్ లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి కొడుకు సూళ్ళూరు పేట మున్నిఫల్ కౌన్సిలర్ వేనాటి సుమంత్ రెడ్డి వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ను కలవడం రాజకీయంగా కలకలం రేపుతోంది. ఎన్టీఆర్ టిడిపిని స్థాపించిన నాటి నుండి వేనాటి కుటుంబం టిడిపితోనే ఉంది. తొలి నాళ్ళలో వేనాటి మునిరెడ్ది, ఆ తర్వాత ఆయన సోదరుడు వేనాటి రామచంద్రారెడ్డి టిడిపిలోనే కొనసాగుతున్నారు. కానీ, సూళ్ళూరు పేట మున్సిఫల్ కౌన్సిలర్ గా కూడ ఉన్న సుమంత్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలో వైఎస్ జగన్ ను కలవడం టిడిపి వర్గాల్లో ఆందోళనకు కారణమైంది.

జిల్లా పరిషత్ ఛైర్మెన్ పదవి దక్కలేదు
వేనాటి మునిరెడ్డి బతికున్న కాలంలో డిసిసిబి చైర్మెన్ పదవిని ఆనాడు టిడిపి కట్టబెట్టింది. జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను కూడ అప్పగించింది. అయితే మునిరెడ్డి మరణంతో ఆయన సోదరుడు వేనాటి రామచంద్రారెడ్డి రంగంలోకి దిగారు. జిల్లా పరిషత్ చైర్మెన్ పదవిని రామచంద్రారెడ్డికి కట్టబెట్టాలని టిడిపి నాయకత్వం భావించింది. కానీ, అదృష్టం మాత్రం రామచంద్రారెడ్డికి దక్కలేదు. దీంతో జిల్లా పరిషత్లో టిడిపి ఫ్లోర్ లీడర్గా రామచంద్రారెడ్డి కొనసాగుతున్నారు. ఆయన తనయుడు సుమంత్ రెడ్డి మాత్రం సూళ్ళూరుపేట మున్సిఫల్ వైస్ చైర్ పర్సన వదవిని ఆశించాడు. కానీ కౌన్సిలర్ గానే సుమంత్ కొనసాగుతున్నాడు.

వాకాటి నారాయణరెడ్డి అరెస్ట్ తో వేనాటి వర్గీయుల్లో ఆశ
రాజకీయాల్లో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో వేనాటి రామచంద్రారెడ్డి ప్రత్యర్థులు వేసిన ఎత్తుల్లో ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలో ఆర్థిక లావాదేవీల కేసుల్లో ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి చిక్కుకోవడంలో వేనాటి వర్గం బలం పుంజుకునే పరిస్థితి ఏర్పడింది. పైగా వేనాటి రామచంద్రారెడ్డి టీటీడీ సభ్యత్వాన్ని కోరుతుండటంతో ఆయన పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలోనే సుమంత్ రెడ్డి జగన్ను కలవడం చర్చనీయాంశమైంది.

అభిమానంతోనే జగన్ ను కలిశా
జగన్ అంటే అభిమానమని, ఆయన విజన్ తనను ఆకట్టుకుందని వేనాటి సుమంత్ రెడ్డి చెప్పడం టీడీపీ నేతలకు మింగుడు పడడం లేదు. తన తండ్రి అనుమతి తరువాతే పార్టీ ప్రవేశమంటూ సుమంత్రెడ్డి ప్రకటించారు. అయితే సుమంత్ వైసీపీలో చేరుతారా అనే చర్చ సాగుతోంది. అయితే తాము టిడిపిలోనే కొనసాగుతామని రామచంద్రారెడ్డి ప్రకటించారు. కానీ, సుమంత్ రెడ్డి వైఎస్ జగన్ ను కలిసిన విషయమై రామచంద్రారెడ్డి మాత్రం స్పందించలేదు.












Click it and Unblock the Notifications