సీజేఐ ఎన్వీ రమణ-జగన్ తేనీటి విందుపై బాంబు పేల్చిన వర్ల రామయ్య: ఏం సందేశం ఇస్తున్నారు?
అమరావతి: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. ప్రస్తుతం తన సొంత రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తోన్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానానికి ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత ఆయన ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. స్వగ్రామం పొన్నవరంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఎడ్లబండిపై ఆయన తన సొంత ఊరిలో కలియ తిరిగారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.

సాయంత్రం గవర్నర్తో భేటీ..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరఫున ఇచ్చిన తేనీటి విందులో పాల్గొన్నారు. ఇవ్వాళ సీజేఐ ఎన్వీ రమణ- గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తో సమావేశం కానున్నారు. ఈ సాయంత్రం 5 గంటలకు రాజ్భవన్లో ఈ భేటీ ఏర్పాటు కానుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాలో ఎన్వీ రమణ తొలిసారిగా వచ్చినందున ఆయన గౌరవార్థం ఈ తేనీటి విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఇతర న్యాయమూర్తులు దీనికి హాజరవుతారు.

తీరిక లేకుండా గడిపిన సీజేఐ..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కొందరు మంత్రులు, అధికారులు ఈ విందులో పాల్గొనే అవకాశం ఉంది. అనంతరం బెజవాడ బార్ కౌన్సిల్ సభ్యుల సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆయన మూడు రోజుల పర్యటన ఈ సాయంత్రానికి ముగుస్తుంది. బార్ కౌన్సిల్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన న్యూఢిల్లీకి బయలుదేరి వెళ్తారని తెలుస్తోంది. తన మూడురోజుల పర్యటనలో భాగంగా సీజేఐ ఎన్వీ రమణ తీరిక లేకుండా గడిపారు. పలు సన్మాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కీలక ప్రసంగాలు చేశారు.

వర్ల రామయ్య ఘాటు వ్యాఖ్యలు..
ప్రభుత్వం తరఫున వైఎస్ జగన్ ఇచ్చిన తేనీటి విందులో సీజేఐ ఎన్వీ రమణ పాల్గొనడం పట్ల తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు వర్ల రామయ్య ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఎవరి పేర్లను కూడా ఆయన ప్రస్తావించలేదు. సీజేఐ ఎన్వీ రమణను వైఎస్ జగన్ సత్కరించిన కొన్ని గంటల వ్యవధిలోనే వర్ల రామయ్య ఈ ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వారిద్దరి భేటీ గురించి పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారనే అభిప్రాయాలు ఉన్నాయి.
ఏం సందేశం ఇస్తున్నారు..
న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానాల్లో ఉన్న న్యాయమూర్తులు.. రాజకీయ నాయకులు ఇచ్చే తేనీటి విందుల్లో పాల్గొనడం వారి నుంచి సత్కారాలను స్వీకరించడం అంత మంచిది కాదేమోనని వర్ల రామయ్య చెప్పారు. ఎన్నో క్రిమినల్ కేసులు న్యాయస్థానాల్లో విచారణలో ఉన్న సమయంలో వాటిని ఎదుర్కొంటోన్న రాజకీయ నాయకుల నుంచి సత్కారాలను స్వీకరించడం ద్వారా సామాన్య ప్రజలకు ఏ సందేశాన్ని ఇస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

న్యాయ వ్యవస్థను సమీక్షించుకోవాల్సి ఉంటుందా?
న్యాయవ్యవస్థలో అత్యున్నత స్థానాల్లో ఉన్న న్యాయమూర్తులు.. ఇలాంటి తేనీటి విందులు, క్రిమినల్ కేసులపై న్యాయస్థానాల్లో విచారణలను ఎదుర్కొంటోన్న రాజకీయ నాయకుల నుంచి సత్కారాలను అందుకోవడం సరికాదని వర్ల రామయ్య పరోక్షంగా అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో న్యాయ వ్యవస్థను సమీక్షించుకోవాల్సి ఉంటుందేమోననే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. అలాంటి రాజకీయ నాయకులు ఇచ్చే తేనీటి విందుల్లో పాల్గొనకుండా సమీక్షించుకోవాల్సిన పరిస్థితి రావాలని అన్నారు.












Click it and Unblock the Notifications