బళ్లారితోనే పోయింది, కొత్తగా ఏముంది: జెసి
అనంతపురం: రాయల తెలంగాణకు తెలుగుదేశం కర్నూలు, అనంతపురం జిల్లా తెలుగుదేశం నాయకులు సుముఖంగానే ఉన్నారని, అయితే బహిరంగంగా మాట్లాడడానికి సిద్దంగా లేరని కాంగ్రెసు రాయలసీమ ప్రాంత సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. అనంతపురం, కర్నూలు జిల్లాలకే చెందిన కొందరు కాంగ్రెసు నాయకులు సమైక్యాంధ్ర అంటుంటే, మరికొందరు రాయల తెలంగాణ ప్రతిపాదన చేస్తున్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
బళ్లారి దూరమైనప్పుడే రాయలసీమ అస్తిత్వం కనుమరుగైందని, ఇప్పుడు కొత్తగా పోయేదేమీ లేదని ఆయన అన్నారు. జీవోఎం కసరత్తు చేసినా కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ తలుచుకుంటే రాయల తెలంగాణ ఏర్పడుతుందని ఆయన అన్నారు. విభజనపై సోనియా గాంధీదే తుది నిర్ణయమని ఆయన అన్నారు. రాయలసీమ యువతకు ఉద్యోగాలు, రైతులకు సాగునీటి కోసమే తాము రాయల తెలంగాణ కోరుతున్నట్లు ఆయన తెలిపారు.
రాయల తెలంగాణ ప్రతిపాదనపై మాట్లాడేందుకు తాను, కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సోనియా గాంధీ అపాయింట్మెంట్ కోరామని, త్వరలోనే తాను ఢిల్లీకి వెళ్తానని ఆయన చెప్పారు. రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రక్రియ ఆగదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం వల్ల న్యాయం జరగదని ఆయన అన్నారు. రాయల తెలంగాణ అంశంపై శాసనసభ్యుడు మధుసూదన్ గుప్తా, జెసి దివాకర్ రెడ్డి అనంతపురం ప్రెస్ క్లబ్లో సమావేశమై చర్చించారు.