భారీ డబ్బుతో.. చంద్రబాబు మమ్మల్ని కొనబోయారు! : వైసీపీ ఎమ్మెల్యే
కర్నూలు : అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ తో ఇప్పటిదాకా 20మంది ఎమ్మెల్యేలు వైసీపీని వీడి టీడీపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా ఈ ఆపరేషన్ ఆకర్ష్ కు బ్రేక్ పడ్డట్టే కనిపిస్తున్నా.. అంతర్గతంగా ఆ ప్రయత్నాలు జరుగుతన్నట్లే కనిపిస్తోంది. తాజాగా ఆదోని వైసీపీ ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్ రెడ్డి చేసిన కామెంట్స్ దీనికి ఊతమిస్తున్నాయి.
డబ్బు ప్రలోభాలతో తనను, తన సోదరుడైన మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిని పార్టీ ఫిరాయించాల్సిందిగా టీడీపీ నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి. టీడీపీలో చేరితే భారీ మొత్తంలో డబ్బు ముట్టజెప్పుతామని టీడీపీ నేతలు ఆఫర్ చేస్తున్నట్లుగా సాయిప్రసాద్ రెడ్డి తెలిపారు.

అయితే తాను, తన సోదరుడు ప్రలోభాలకు లొంగే వ్యక్తులం కాదని, నమ్మకంతో గెలిపించిన ప్రజల విశ్వాసానికి కట్టుబడి ఉంటామన్న తరహాలో వ్యాఖ్యలు చేశారు సాయిప్రసాద్ రెడ్డి. అవినీతికి పాల్పడ్డ సొమ్ముతోనే వైసీపీ ఎమ్మెల్యేలను కొనేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీలకు ఉచిత విద్యుత్ ఇస్తానన్న హామిని చంద్రబాబు మరిచిపోయారని, ఇప్పుడు వేల బిల్లులు వేస్తున్నారని ఆయన విమర్శించారు. ఇక గడపగడపకు కార్యక్రమంలో ప్రజలంతా చంద్రబాబుకు సున్నా మార్కులే వేస్తున్నారని చెప్పుకొచ్చారు సాయిప్రసాద్ రెడ్డి.












Click it and Unblock the Notifications