కుదిపేస్తున్న కాల్మనీ కేసు: మొత్తం వారే, ప్రజల వద్ద చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారా?
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్మనీ వ్యవహారంలో రోజుకో కొత్త అంశం వెలుగులోకి వస్తుంది. కాల్మనీ వ్యవహారంలో టాస్క్ఫోర్స్ పోలీసులు నిందుతులుగా పేర్కొన్న ఏడుగురిలో ఐదుగురు తెలుగుదేశం పార్టీకి చెందిన వారైనప్పటికీ ప్రభుత్వం వారిని రక్షించేందుకు నానా తంటాలు పడుతోంది.
ఈ కాల్మనీ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్యేల ప్రమేయం ఉన్నట్లు సాగుతున్న వార్తలకు బలం చేకూర్చే విధంగా మీడియాలో ఫోటోలు వచ్చాయి. కాల్మనీ వ్యవహారంలో ఏ1 నిందితుడిగా ఉన్న యలమంచిలి శ్రీరామమూర్తి అలియాస్ రాముకి విజయవాడ నగర టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి.
ఇటీవలే ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గెస్ట్హౌస్లో జరిగిన ఒక పార్టీయే వీరంతా కలిసి ఓ వేడుకను చేసుకున్నారు. ఈ వేడుకకు విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరయ్యారు. ఈ వేడుకలో కాల్మనీ వ్యవహారంలో ఏ1 నిందితుడిగా ఉన్న రాము కూడా ఇందులో పాల్గొనడం పార్టీ నేతలతో రాముకున్న సన్నిహిత సంబంధాన్ని స్పష్టం చేస్తోంది.
కాగా కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న భవానీ శంకర్ ఓ బౌన్సర్. ఇతను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అనుచరుడైన కార్పొరేటర్ ఆత్కూరి రవికుమార్కు అత్యంత సన్నిహితుడు. కాగా భవానీ శంకర్ ఖరీదైన జాగ్వార్ (ఏపీ 16డీఏ 5111) కారును ఉపయోగిస్తున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ కారును భవానీ శంకర్కు రవికుమార్ ఇచ్చాడని కాల్మనీ బాధితులు చెబుతున్నారు.
ఈ కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న విద్యుత్ శాఖ డీఈ సత్యానందంకు సాక్ష్యాత్తు సీఎం చంద్రబాబు, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ ఏబీ వెంకటేశ్వరరావుతోనూ కలసి దిగిన ఫొటోలు కూడా వెలుగుచూశాయి. అంతేకాదు చంద్రబాబుతో ఉన్న సత్సంబంధాల కారణంగానే సత్యానందం గతంలో నందిగామ టిక్కెట్ కోసం ప్రయత్నించారని తెలిసింది.
ఇక ఈ కేసులో బాధితులు అత్యంత క్రూరుడిగా అభివర్ణించిన ఏ5 నిందితుడు వెనిగళ్ల శ్రీకాంత్కు టీడీపీ పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్తో ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరూ కలిసి పలుమార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారు. గత వారంలో ఈ కాల్మనీ వెలుగులోకి వచ్చినప్పుడు కూడా వీరిద్దరూ విదేశాల్లోనే ఉన్నారు.
బ్యాంకాక్లో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా హల్చల్ చేశాయి. ఈ కేసులో ఏ6 నిందితుడుగా ఉన్న పెండ్యాల శ్రీకాంత్ కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తగా ఉన్నారు. కాగా ఏడో నిందితుడు దూడల రాజేశ్ గతంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయాడు.
అయితే దూడల రాజేష్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్తో కలిసి ఉన్న ఫోటోలు మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలను ఆధారం చేసుకునే గురువారం జరిగిన శాసనసభ సమావేశాల్లో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వీరిద్దరి మధ్య సంబంధాన్ని బయట పెట్టాలని అసెంబ్లీలో నిలదీశారు.