చంద్రబాబుకు కొత్త తలనొప్పి: తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ, ఎటూ చెప్పలేక పోతున్నారా?
అమరావతి: టీడీపీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్' ఆ పార్టీలో కొత్త కుంపట్లను రాజేస్తుందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఏపీలో అధికార పార్టీ టీడీపీలో 'ఆకర్ష్' ముందు వరకు అంతా సవ్యంగానే ఉంది. ఎప్పుడైతే టీడీపీ 'ఆపరేష్ ఆకర్ష్'కు తెరలేపిందో ఆప్పటి నుంచి ఆ పార్టీలో తెలుగు తమ్ముళ్ల ఘర్షణకు దిగుతున్నారు.
మొన్న కర్నూలు జిల్లాలో భూమా, శిల్పా వర్గాలు, నిన్న ప్రకాశం జిల్లాలో కరణం, గొట్టిపాటి వర్గాలు... తాజాగా పార్టీకి పెట్టని కోటగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్తపల్లి సుబ్బారాయుడు, ఎమ్మెల్యే మాధననాయుడు వర్గాల మధ్య విబేధాలు పార్టీకి ఇబ్బందిగా మారాయి.
శనివారం నాడు ఒంగోలు మినీ మహానాడులో కరణం, గొట్టిపాటి వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలను ఇక ఎంతమాత్రం సహించేది లేదని పార్టీ అధినేత చంద్రబాబు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన మరుక్షణమే నరసాపురంలో జరిగిన మినీ మహానాడులో కొత్తపల్లి, మాధవనాయుడు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడం విశేషం.
నరసాపురం టీడీపీ నియోజకవర్గ సమావేశం ఆదివారం జరిగింది. ఇటీవలే వైసీపీని వీడి టీడీపీలో చేరిన కొత్తపల్లి సుబ్బారాయుడు భారీ ర్యాలీగా సమావేశానికి హాజరయ్యారు. వీరితో పాటు జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మీ, నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవనాయుడు సైతం హాజరయ్యారు.
ఈ సందర్భంగా కొత్తపల్లి అనుచరులు ఆయనకు అనుకూలంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. దీంతో మాధవనాయుడు వర్గీయులు కూడా పోటా పోటీ నినాదాలు చేయడంతో సమావేశం రసాభాసగా మారింది. వేదిక ఎక్కే విషయంలో ఒక వర్గాన్ని ఇంకో వర్గం అడ్డుకునే యత్నం చేసింది.
దీంతో ఇరువర్గాలు బాహాబాహీగా దిగి ఒకరిపై మరొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఈ గందరగోళంలోనే మాధవనాయుడు మైకు అందుకొన్నారు. 'ఇది వైసీపీ సమావేశం కాదు' అని మండిపడ్డారు. దీనిపై కొత్తపల్లి అనుచరులు మాధవనాయుడికి నిరసన తెలిపారు.
దీంతో తీవ్ర ఆగ్రహం చెందిన ఎమ్మెల్యే మాధవనాయుడు సమావేశం నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయారు. తన సమక్షంలోనే గొడవ జరగడంపై జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మీ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. కొత్తపల్లి తీరు బాగోలేదని, పద్ధతి మార్చుకోవాలని ఆమె సూచించారు.
కొత్తపల్లి వ్యవహారశైలిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేయునున్నట్లు ఆమె తెలిపారు. ఆ తర్వాత కూడా ఇరువర్గాలు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నాయి. తదనంతరం ఎమ్మెల్సీ షరీఫ్ జోక్యంతో ఇరువర్గాలు శాంతించగా, సమావేశం సజావుగా కొనసాగింది. ప్రస్తుతం జిల్లా టీడీపీ నేతలు ఎమ్మెల్యే మాధవనాయుడు బుజ్జగించే పనిలో ఉన్నారు.