Next CM NTR: టీడీపీ సభలో జూనియర్ ఎన్టీఆర్కు అవమానం: ఫ్యాన్స్ ఫైర్..ఫైనల్ అల్టిమేటం
విజయవాడ: తెలుగుదేశం పార్టీని జూనియర్ ఎన్టీఆర్ భయం.. నీడలా వెంటాడుతూనే వస్తోంది. జూనియర్ ఎన్టీఆర్కు పార్టీ పగ్గాలను అప్పగించానే డిమాండ్ ఊపందుకున్న ప్రస్తుత పరిస్థితుల్లో- తాజాగా చోటు చేసుకున్న ఘటన ఆయన అభిమానులను మరింత ఆగ్రహానికి గురి చేసినట్టయింది. పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో ఎన్టీఆర్ బ్యానర్లు, ఫ్లెక్సీలు వెలిశాయి. టీడీపీ కార్యకర్తలు స్వయంగా వాటిని ప్రదర్శించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
కుప్పంలో..
జూనియర్ ఎన్టీఆర్కు పార్టీ పగ్గాలను అప్పగించాలంటూ సాక్షాత్తూ టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో సైతం డిమాండ్ ఊపందుకున్న విషయం తెలిసిందే. చంద్రబాబు సమక్షంలోనే ఎన్టీఆర్కు అనుకూలంగా కుప్పం టీడీపీ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇతర నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పరిస్థితులే కనిపించాయి.
నందిగామలో..
ఇప్పుడు తాజాగా మళ్లీ అలాంటి ఉదంతమే చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కంచికచర్ల మండలం పరిటాలలో నిర్వహించిన రైతు పోరు సభలో కూడా జూనియర్ జెండాలు ఎగిరాయి. ఫ్లెక్సీలు వెలిశాయి. ఎన్టీఆర్కు పార్టీ పగ్గాలను అప్పగించాలంటూ కొందరు టీడీపీ కార్యకర్తలు స్వయంగా జూనియర్ ఫొటోలు ముద్రించివున్న ఫ్లెక్సీలు, బ్యానర్లను ప్రదర్శించారు. పరిటాలకు వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా బ్యానర్లు కట్టారు.
నెక్స్ట్ సీఎం ఎన్టీఆర్..
నెక్స్ట్ సీఎం ఎన్టీఆర్ అని రాసివున్న జెండాలను విస్తృతంగా ఎగురవేశారు. ఎన్టీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. సభలో నాయకులు ప్రసంగిస్తోన్న సమయంలోనూ వాటిని ప్రదర్శించారు. ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా నాయకులను అసహనానికి గురి చేశాయి. అభిమానులు కట్టిన బ్యానర్లు, ఫ్లెక్సీలను వారు తొలగించారు. బ్యానర్లను ప్రదర్శించిన అభిమానులను సభా ప్రాంగణం నుంచి బలవంతంగా వెనక్కి పంపించేశారు.
అభిమానులు అల్టిమేటం..
ఈ రైతు పోరు సభకు ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడం టీడీపీ నాయకులను ఆందోళనకు గురి చేసింది. విజయవాడ, మచిలీపట్నం, నందిగామ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల వంటి ప్రాంతాల నుంచి వారు ప్రత్యేక వాహనాలతో పరిటాల రైతుపోరు సభకు వచ్చారు. ఇకపై టీడీపీ ఎక్కడ, ఎలాంటి సభ నిర్వహించినా జూనియర్ ఎన్టీఆర్ జెండాలను ఎగురవేస్తామని అభిమానులు తేల్చి చెప్పారు. టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ చేతికి వచ్చేంత వరకూ ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూనే ఉంటామని అల్టిమేటం ఇచ్చారు.
లక్ష్యం అదే..
ఈ రైతుపోరు సభలో టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల, మాజీ మంత్రులు దేవినేని ఉమా మహేశ్వర రావు, కొల్లు రవీంద్ర, మాజీ శాసన ఎమ్మెల్యేలు బొండా ఉమా మహేశ్వర రావు, తంగిరాల సౌమ్య సహా పలువురు నాయకులు హాజరయ్యారు. రాజధాని రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలంటూ డిమాండ్ చేశారు. అమరావతిని శాశ్వత రాజధానిగా కొనసాగించాలని తీర్మానించారు. అమరావతి ప్రాంతాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూరకంగా ధ్వంసం చేశారంటూ మండిపడ్డారు.