ప్రధాని మోడీపై బాలకృష్ణ వ్యాఖ్యలు.. వాస్తవమే, ఇదీ విషయం! బీజేపీకి ఉలుకెందుకు
అమరావతి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితం చేసిన ధర్మపోరాట దీక్షలో హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలను టీడీపీ నేతలు సమర్థిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన వ్యాఖ్యలు వక్రీకరించారని కొందరు అంటే, ఆ వ్యాఖ్యలపై రాద్దాంతం చేయవద్దని మరికొందరు చెబుతున్నారు.
బట్టలూడదీసి కొడదాం! త్వరలో: ఆర్కేకు పవన్ ట్వీట్ వార్నింగ్, టీవీ9 రవిప్రకాశ్ చెప్పుతో దాడి అంటూ..
బాలకృష్ణ ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు అనవసర రాద్ధాంతం సృష్టిస్తున్నారని, ఇది సరికాదని ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప అన్నారు. బాలకృష్ణ వ్యాఖ్యలు తప్పని బీజేపీ ప్రభుత్వం నిరూపించుకోవాలని సవాల్ చేశారు.
పలు కేసుల్లో నిందితులకు మోడీ అపాయింటుమెంట్
బీజేపీ నాయకులు ముఖ్యమంత్రి చంద్రబాబు పైనా విమర్శలు చేస్తున్నారని చినరాజప్ప మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న తమకు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింటుమెంట్ ఇవ్వడం లేదన్నారు. పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి ఎప్పుడైనా కలిసే అవకాశం కల్పిస్తున్నారన్నారు. హోదా ఇస్తామని చెప్పిన మోడీ ఇప్పుడు మోసం చేయడం తప్పు కాదా అన్నారు.
మోడీపై బాలకృష్ణ వ్యాఖ్యలు.. ఇదీ విషయం!
బాలకృష్ణ ప్రసంగాన్ని బీజేపీ నేతలు వక్రీకరించారని వర్ల రామయ్య అన్నారు. బంకర్లో దాగినా భరతమాత వదలదు అనే అర్థం వచ్చేలా మాట్లాడారని, దానికి వారు మరో అర్థం వచ్చేలా వక్రీకరించారని ధ్వజమెత్తారు. టీ కప్పులో పడిన ఈగను కూడా చప్పరిస్తారనే బాలకృష్ణ మాటలో ఇక్కడ ఈగ అంటే ఏపీ అని చెప్పారని తెలిపారు. హిందీలో ఒక పిసినారి.. నెయ్యి ఉన్న డబ్బాలో పడిన ఈగను చప్పరించారని ఉందని, దానిని వక్రీకరించే వారికి హిందీ తెలిసి ఉండాలన్నారు.
అయిదు కోట్ల మంది ఆంధ్రుల ఆగ్రహం బాలయ్య చెప్పారు
బీజేపీతో తాము తెగదెంపులు చేసుకున్నప్పటి నుంచి ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్ క్రమంగా పడిపోతోందని మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలను కొందరు బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారన్నారు. ఆయన వాస్తవమే మాట్లాడితే అనవసర రాద్దాంతం చేస్తున్నారన్నారు. ఉన్నమాట అంటే ఉలుకెందుకన్నారు. ఏపీకి తీరనిద్రోహం చేసిన మోడీపై అయిదు కోట్ల మంది ఆంధ్రులు ఎంత ఆగ్రహంతో ఉన్నారో బాలయ్య తన మాటల ద్వారా తెలియజేస్తే రాష్ట్రంలోని బీజేపీ నేతలు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారన్నారు.
తెలుగువారి కోపం తెలియజేశారు
ఖండాంతరాల్లోని తెలుగువారు కూడా చంద్రబాబు దీక్షపై స్పందిస్తున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. బాలకృష్ణ తెలుగవాడికి కోపం వస్తే ఎలా ఉంటుందో తెలియజేశారన్నారు.