చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు: బాధించాయి, దాసరిపై టిడిపి రుసరుస
విజయవాడ: దాసరి నారాయణ రావు వంటి వ్యక్తులు కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంతో చేరి చంద్రబాబు ప్రభుత్వం పైన విమర్శలు చేయడం సరికాదని, ఇది బాధాకరమని కాపు కార్పోరేషన్ చైర్మన్ రామానుజయ ఆదివారం అన్నారు.
ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలనే ఉద్దేశ్యంతోనే ఆయన విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కాపుల మధ్య చిచ్చు పెట్టాలని ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని ధ్వజమెత్తారు. విజయవాడలో ఈ నెల 19, 20 తేదీల్లో కాపు నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. 21వ తేదీన కాపు జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. దీనికి సుమారు వంద కంపెనీలు హాజరు అవుతాయని చెప్పారు.
కాగా, కొద్ది రోజుల క్రితం కాపు నేతలు ముద్రగడ పద్మనాభం, దాసరి నారాయణ రావు, అంబటి రాంబాబు తదితరులు హైదరాబాదులో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దాసరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మనమంతా ముద్రగడ వెనుక ఉన్నామన్న సంకేతాలివ్వాలని, మనలో కూడా కొందరు బాబుకు ఏజెంట్లు ఉన్నారని, వాళ్లెవరో నాకు తెలుసునని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉంటూనే కార్యాచరణ రూపొందించుకోవాలని, బాబు ఒత్తిడి తట్టుకునే రకం కాదని, అందుకే విభజించి పాలిస్తుంటారని వ్యాఖ్యానించారు.
అంతేకాదు, మనం కూడా ఒత్తిడి చేస్తేనే దారికొస్తాడని, మన ఉద్యమానికి బీసీ, ఎస్సీల సహకారం కూడా తీసుకోవాలని వ్యాఖ్యానించారు. తాము సమావేశమైన హోటల్లో సీసీటీవీలు ఏర్పాటు చేశారని, ఇక్కడ మేం ఏం మాట్లాడుకున్నామో చంద్రబాబు నేరుగా చూడవచ్చునని వ్యాఖ్యానించారు. దాసరి ఇలా మాట్లాడటంతో టీడీపీ నేతలు రుసరుసలాడుతున్నారు.