ఒక్క విస్తరణ.. ఎన్నో లెక్కలు-పార్టీలో చిచ్చు: పక్కా ప్లాన్, జగన్ కోసం సీనియర్లకు చెక్
దాదాపు మూడేళ్ల తర్వాత ఏపీలో జరిగిన కేబినెట్ విస్తరణ తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేపుతోంది.
అమరావతి: దాదాపు మూడేళ్ల తర్వాత ఏపీలో జరిగిన కేబినెట్ విస్తరణ తెలుగుదేశం పార్టీలో చిచ్చు రేపుతోంది. ముఖ్యంగా ఏళ్ల తరబడి పార్టీకి సేవలు చేసిన వారిని పక్కన పెట్టి, ఆయారాం, గయారాంలను అందలం ఎక్కించారని సీనియర్ నేతలు నిప్పులు చెరుగుతున్నారు.
విస్తరణ: హరికృష్ణ-కళ్యాణ్ రామ్ హాజరు, కాళ్లుమొక్కిన లోకేష్, తడబడిన అఖిల ప్రియ
ఒక్క కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ టిడిపిలో నిప్పు రాజేసినప్పటికీ.. చంద్రబాబు టార్గెట్ 2019, టార్గెట్ జగన్గా పక్కాగా ప్లాన్ చేసినట్లుగా కనిపిస్తోందనే వాదనలు వినిపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే.. కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి తరఫున బీటెక్ రవి గెలిచారు.
ఆ గెలుపు ఊపులో పక్కా లెక్కలతో రాయలసీమపై పూర్తి పట్టు సాధించే ఉద్దేశ్యంలో భాగంగానే కేబినెట్ విస్తరణ కనిపిస్తోందంటున్నారు. అలాగే, వైసిపికి అండగా ఉన్న రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసినట్లుగా స్పష్టంగా తెలుస్తోందని చెబుతున్నారు.
నాడు పవన్ కళ్యాణ్పై అలా, నేడు రివర్స్: టిడిపిపై బోండా తీవ్ర వ్యాఖ్య
ఆయా సందర్భాల్లో టిడిపి నేతలు విపక్షాలపై, టిడిపిని నిలదీసిన వారిపై ఎదురు దాడి చేశారు. అలా చేసిన వారిలో దాదాపు ఎవరికీ పదవులు దక్కలేదని చెప్పవచ్చు. వైసిపి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, జగన్ను ఇరుకున పెట్టే వారికి ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.
అసంతృప్త నేతలు
గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కాగితపు వెంకట్రావు, దూళిపాళ్ల నరేంద్ర, చింతమనేని ప్రభాకర్, గౌతు శివాజీ, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, బండారు సత్యనారాయణ మూర్తి, బోండా ఉమ, వంగలపూడి అనిత, బీకే పార్థసారథి.. ఇలా ఎందరో ఆశలు పెట్టుకున్నారు. కానీ వారికి ఎవరికీ దక్కలేదు.
అదే సమయంలో, కొన్ని కారణాల వల్ల పార్టీ సీనియర్ నేత బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి, కాల్వ శ్రీనివాసులు వంటి వారికి కేబినెట్ నుంచి ఉధ్వాసన పలికారు.
అలా వచ్చారు.. ఇలా పదవి కొట్టారు
ఇక, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఆదినారాయణ రెడ్డి, అఖిల ప్రియ, అమర్నాథ్ రెడ్డి, సుజయ కృష్ణ రంగారావులకు అవకాశం కల్పించారు. నెల్లూరు నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అవకాశం వచ్చింది. వైసిపి నుంచి వచ్చిన వారిలో జలీల్ ఖాన్ వంటి వారికి పదవి దక్కుతుందనుకున్నప్పటికీ అది జరగలేదు.
2019లో జగన్ టార్గెట్గా విస్తరణ
అనంతపురం మినహా కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో టిడిపి పట్టు సాధించలేదు. 2019 ఎన్నికల నాటికి రాయలసీమలో పట్టు సాధించే ఉద్దేశ్యంలో భాగంగా ఈ విస్తరణ జరిగిందంటున్నారు. ముఖ్యంగా కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో పట్టు పెంచుకునేందుకు వలసలను ప్రోత్సహించిన చంద్రబాబు.. ఆ తర్వాత ఇప్పుడు మరింత పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు.
కర్నూలు నుంచి భూమా అఖిల ప్రియ, చిత్తూరు నుంచి అమర్నాథ్ రెడ్డి, కడప నుంచి ఆదినారాయణ రెడ్డిలు 2014లో వైసిపి నుంచి గెలిచారు. ఆ తర్వాత టిడిపిలో చేరారు. టిడిపిలో చేరిన తర్వాత వీరి జగన్పై విమర్శలు గుప్పించారు. జగన్తో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి విజయం సాధించింది.
కర్నూలులో భూమా నాగిరెడ్డి, కడపలో ఆదినారాయణ రెడ్డిలు టిడిపి నేతల విజయం కోసం కృషి చేశారు. దీంతో కర్నూలు ఎమ్మెల్సీగా శిల్పా చక్రపాణి రెడ్డి, కడపలో బీటెక్ రవి గెలిచారు. ఇదే ఉత్సాహం, గెలుపు 2019లో ఉండాలంటే ఈ జిల్లాల్లో పట్టు సాధించాలని చంద్రబాబు భావించారు.
అఖిల సహా ఈ ముగ్గురికి అందుకే
అందుకే, భూమా అఖిల ప్రియ, ఆదినారాయణ రెడ్డి, అమర్నాథ్ రెడ్డిలకు మంత్రి పదవులు ఇచ్చి మరింత పట్టు నిలుపుకునేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఈ సామాజిక వర్గం వైసిపికి అండగా ఉంది. వీరిని తమవైపుకు తిప్పుకునే ఉద్దేశ్యంలో భాగంగా చంద్రబాబు పక్కా ప్లాన్తో పై ముగ్గురికి మంత్రి పదవి ఇచ్చారని చెబుతున్నారు.
అనంతపురం జిల్లాలో పల్లె రఘునాథ్ రెడ్డి స్థానంలో కాల్వ శ్రీనివాసులుకు అవకాశం వచ్చంది. దీంతో ఇక్కడ బీసీ సామాజిక వర్గాన్ని మరింత దగ్గర చేసుకునే ఉద్దేశ్యంలో భాగంగా కాల్వకు అవకాశమిచ్చారని చెబుతున్నారు.
ఏళ్లుగా అండగా ఉన్నారు.. కానీ
గోరంట్ల, కాగితపు, దూళిపాళ్ల, బండారు.. ఇలా ఏళ్లుగా టిడిపికి అండగా ఉన్నారు. కానీ ఇతర జిల్లాల్లో పట్టు కోసం, సామాజిక వర్గాల ఇబ్బంది కారణంగా వీరికి చోటు దక్కలేదు. రోజాను ధాటిగా ఎదుర్కొంటున్న వంగలపూడి అనితకు కేబినెట్లో చోటు దక్కుతుందని భావించారు. కానీ అది జరగలేదు.
అండగా నిలబడిన బోండా
విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమ కాపు అంశం విషయంలో పార్టీకి ఎంతో అండగా నిలబడ్డారు. పవన్ కళ్యాణ్, విపక్షాలు, ముద్రగడ పద్మనాభం సహా ఎవరు కాపు అంశంపై ప్రభుత్వాన్ని విమర్శించినా.. బోండా కౌంటర్ ఇచ్చేవారు. ఆయన కూడా పదవి వస్తుందని ఆశించారు. తనను కేబినెట్లోకి తీసుకోకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ఓ సమయంలో రాజీనామా చేస్తానని ప్రకటించారు. కానీ చంద్రబాబు బుజ్జగింపుతో కాస్త తగ్గారు.
విజయనగరంలో..
విజయనగరంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణకు చెక్ చెప్పేందుకే చంద్రబాబు.. వైసిపి నుంచి వచ్చిన సుజయ కృష్ణ రంగారావుకు మంత్రి పదవి ఇచ్చారు. మెత్తగా ఉండే మృణాళిని తొలగించారు. ఆమెపై ఆరోపణలు లేవు. కానీ మెత్తగా ఉండటం ఆమెకు కలిసి రాలేదు.
నెల్లూరులో...
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మేకపాటి సోదరుల హవా ఉంటుంది. అలాగే, ఆ సామాజిక వర్గం హవా ఉంటుంది. దీంతో పాటు కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి వైయస్ వివేకాను టిడిపి అభ్యర్థి బీటెక్ రవి ఓడించడం వెనుక.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాత్ర కూడా కొంత ఉంది. ఈ కారణాలన్నింటితో సోమిరెడ్డిని కేబినెట్లోకి తీసుకున్నారు.
అసంతృప్తుల వెల్లువ.. రాజీనామాల హెచ్చరిక
చంద్రబాబు టార్గెట్ 2019, టార్గెట్ జగన్తో విస్తరణ చేశారు. ఈ కారణంగా పార్టీ కోసం చాలాకాలంగా పని చేసిన వారికి పదవులు రాలేదు. అయిదారుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన గోరంట్ల, దూళిపాళ్ల, కాగిత వంటి వారికి చేయిచ్చారు. అలాగే, ప్రత్యర్థి నేతలను ధీటుగా ఎదుర్కొంటున్న వంగలపూడి అనిత, బోండా ఉమలకు కూడా చోటు దక్కలేదు. దీంతో అసంతృప్తి వెల్లువెత్తుతోంది. చాలామంది రాజీనామాలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.