జూ.ఎన్టీఆర్ టీడీపీ పిలుస్తోంది..రా కదలిరా:నాడు పవన్ వద్దకు వెళ్లారుగా:చంద్రబాబుకు తప్పదా.
Recommended Video
టీడీపీలో జరుగుతన్న పరిణామాలతో పార్టీలో కొత్త చర్చ మొదలైంది. ఇదంతా చంద్రబాబు ఉదాసీనతో జరిగిందని చెబుతున్న సమయంలో ఆయన తనయుడు లోకేశ్ మీద నేతలు మంది పడుతున్నారు. లోకేశ్ అతి జోక్యం కారణమే ఇప్పుడు పార్టీకి ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. ఎంపీల మొదలు రహస్యంగా సమావేశమైన కాపు నేతల వరకూ లోకేశ్ లక్ష్యంగా ఆరోపణలు ఎక్కుపెడుతున్నారు. పార్టీ సీనియర్లు ఈ సమయంలో క్లీన్ ఇమేజ్..ప్రజాకర్షణ ఉన్న జూనియర్కు పార్టీలో కీలక బాధ్యతలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. నాడు పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లి మద్దతు కోరిన చంద్రబాబు..ఇప్పుడు పార్టీ కోసం జూనియర్ను ఆహ్వానించలేరా అని ప్రశ్నిస్తున్నారు.
బాబూ...లోకేశ్ ఇక చాలు..
టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాల పైన అధినేత మొదలు పార్టీ నేతల వరకు ఇటువంటి సంక్షోభాలు ఎన్నో చూసామని చెబుతున్నా..అప్పటికి ఇప్పటికీ పరిస్థితిలో చాలా తేడా ఉంది. ప్రధాని మోదీ కారణంగా చంద్రబాబు తో సహా ఆయన పార్టీ నేతలు సైతం అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ఏపీలో వైసీపీ అసాధాణ మెజార్టీతో అధికారంలోకి రావటంతో..టీడీపీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. అయితే, జరుగుతున్న పరిణామాలకు..నేతలు పార్టీని వీడటానికి అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు తన కుమారుడు లోకేశ్ కు ఇచ్చిన అవసరం మించిన ప్రాధాన్యతే దెబ్బ తీసిందనే వాదన తెర మీదకు తెస్తున్నారు. పార్టీ మారిన రాజ్యసభ సభ్యులు..రహస్యంగా సమావేశమైన కాపు నేతల సమావేశంలోనే లోకేశ్ తీరు పైన ఆందోళన వ్యక్తం చేసారు. దీంతో..ఇప్పటికైనా లోకేశ్ ప్రాధాన్యత తగ్గించి పార్టీకి ఎవరు అవసరమో..ఏం చేయాలో అధినేత గుర్తించాలని..చంద్రబాబు విదేశాల నుండి తిరిగి వచ్చిన తరువాత ఇదే విషయం స్పష్టం చేస్తామని సీనియర్లు చెబుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ రా కదలిరా..
ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబుకు తోడుగా జనాకర్షణ కలిగిన వారు పార్టీకి అవసరమని టీడీపీ నేతలు చెబుతున్నారు. జగన్ జనాకర్షణను తట్టుకోవాలన్నా..పార్టీ నుండి వలసలు ఆగాలన్నా..భవిష్యత్ మీద నమ్మకం కలిగించే నేత కావాలని చెబుతున్నారు. అందులో భాగంగానే..లోకేశ్ కోసం పార్టీ నుండి దూరం పెట్టిన జూనియర్ ఎన్టీఆర్ను రంగంలో దించాలని సీనియర్లు అంతర్గత చర్చల్లో అభిప్రాయ పడుతున్నారు. పార్టీ అధికారంలో ఉండటంతో ఇంత కాలం ఇబ్బందులు ఉన్నా నెట్టుకొచ్చామని..ఇప్పుడు ప్రతిపక్షం నుండి ప్రజల్లో స్థానం సంపాదించి తిరిగి అధికారంలోకి రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ ను ఆహ్వానించాలని కోరుతున్నారు. బాలకృష్ణ పార్టీలో ఉన్నా..ఆయన రాజకీయంగా నెట్టుకురాలేరనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. జూనియర్ను రంగంలోకి దిచంటం ద్వారా నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత..పార్టీలో కొత్తదనం..పార్టీ పట్ల ప్రజల ఆలోచనల్లో మార్పు వస్తుందని సీనియర్ నేతలు చెబుతున్నారు.
చంద్రబాబుకు ఇక తప్పదు..జూనియర్ ఆమోదిస్తారా
చంద్రబాబుకు ఇప్పుడు రాజకీయంగా జీవన్మరణ సమస్య. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ..వైసీపీని ఎదుర్కోవాలంటే ఎంత అనుభవం ఉన్నా అంత సులువు కాదు. జగన్ పాలనలోనూ దూసుకెళ్తున్నారు. ఇక..జూనియర్ ను చంద్రబాబు ఆహ్వానించాల్సిందేననే డిమాండ్ నిన్నటి నుండి గట్టిగా వినిపిస్తోంది. 2014 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి మద్దతు కోరిన చంద్రబాబు ఇప్పుడు జూనియర్ను ఆహ్వానించటానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక, ఇదే సమయంలో జూనియర్ సైతం పార్టీలో యాక్టవ్ అవ్వటానికి సిద్దంగా ఉన్నారా అనే చర్చ సాగుతోంది. గత ఏడాది తెలంగాణ ఎన్నికల్లో కుకట్పల్లి నుండి ఆయన సోదరి సుహాసినికి పార్టీ టిక్కెట్ ఇచ్చినా ఆయన ప్రచారం చేయలేదు. గతంలో జరిగిన పరిణామాలను జూనియర్ మర్చిపోలేరని..అయినా ఇప్పుడు ఆయన్ను ఒప్పించాల్సిన బాధ్యత చంద్రబాబు పైనే ఉందంటున్నారు సీనియర్లు.