ఆదాయం లేని ఏకైక రాష్ట్రం, అప్పుడు మద్యం, ఇప్పుడు మాంసం: ఏపీ సర్కారుపై టీడీపీ నేతల ఫైర్
అమరావతి: ఏపీ సర్కారుపై మాజీ మంత్రులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బుద్ధా వెంకన్న తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ సర్కారు అవలంభిస్తున్న విధానాలను తప్పుబట్టారు. ఈ ముగ్గురు నేతలు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఏపీ సర్కారుపై తీవ్ర విమర్శలు ఎక్కుపెట్టారు.
అప్పులు తప్ప ఆదాయ మార్గమేది?: యనమల
అప్పులు తప్ప ఆదాయం లేని రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించిందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. ఏపీలో ఆర్థిక అసమానతలు 32 శాతం నుంచి 43 శాతానికి పెరిగాయని యనమల ఓ ప్రకటనలో విమర్శించారు. రాష్ట్రానికి రెండున్నరేళ్లుగా అప్పులే తప్ప ఆదాయ మార్గాలు లేవని, తెచ్చిన అప్పులకూ లెక్కాపత్రం లేదని మండిపడ్డారు. అప్పు తెచ్చిన రూ. 2.68 లక్షల కోట్లలో రూ. 1.05 లక్షల కోట్లు సంక్షేమం కోసమని రాష్ట్ర ఆర్థిక మంత్రి చెబుతున్నారని.. వాస్తవంగా ఖరచు చేసింది రూ. 68 వేల కోట్లేనని యనమల తెలిపారు. కేపిటల్ ఎక్స్పెండిచర్ కోసం రూ. 31వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, మిగిలిన రూ. 1.68 లక్షల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారని, ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ప్రశ్నించారు యనమల. గత టీడీపీ ప్రభుత్వం 17 సంక్షేమ పథకాలు అమలు చేస్తే.. వైసీపీ 5 పథకాలు మాత్రమే తీసుకొచ్చిందన్నారు. సంక్షేమ పథకాలపై ఖర్చులో దేశంలోనే రాష్ట్రం 18వ స్థానంలో నిలిచిందన్నారు.
అప్పుడు మద్యం.. ఇప్పుడు మాంసం..: బుద్ధ వెంకన్న
అమరావతి కేంద్ర కార్యాలయంలో టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ.. మాంసం, చేపలు, రొయ్యలు అమ్మే బడుగు బలహీన వర్గాల పొట్ట కొట్టేందుకే మటన్ మార్టుల పేరిట సీఎం జగన్ కొత్త పథకానికి శ్రీకారం చూడుతున్నారని ఆరోపించారు. ఉన్నత చదువులు చదవిని విద్యార్థులకు తగిన ఉద్యోగాలు ఇవ్వలేని అసమర్థ సీఎం.. ఇప్పుడు మాంసం దుకాణాల్లో కొలువులివ్వడానికి సిద్ధమయ్యారని మండిపడ్డారు. కొత్త సంస్థలను తీసుకొచ్చే సత్తా వైసీపీ సర్కారుకు లేదని, అందుకే మొబైల్ మార్టుల ద్వారా మాంసం విక్రయించేందుకు సిద్ధమవుతోందని ఎద్దేవా చేశారు. ఇప్పటికే ప్రభుత్వం మద్యం దుకాణాల్లోని కల్తీ మద్యం తాగి చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో కల్తీ మాంసం, చేపలు విక్రయించేందుకే ఈ కార్యక్రమాన్ని రూపొందించారా? అని నిలదీశారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సలహాతోనే సీఎం జగన్ మటన్ మార్టుల ఏర్పాటుకు సిద్ధమయ్యారనిపిస్తోందన్నారు. జగన్, విజయసాయి ఆలోచనలన్నీ అంతిమంగా వారి ఖజానా నిండేందుకే పనికొస్తాయని తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. మార్టుల ద్వారా మాంసం విక్రయించాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించాలని లేదంటే.. బడుగుబలహీన వర్గాలతో కలిసి భారీ ఎత్తు ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
Recommended Video
రైతులకు జగన్ వెన్నుపోటు అంటూ సోమిరెడ్డి
మరో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. ఏపీ వ్యవసాయ రంగానికి రైతులకు సీఎం జగన్ వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మూతపడిందని తీవ్రంగా స్పందించారు. ధాన్యం కొనుగోళ్లలో దళారులు చేరి చివరకు రైతుల నోట్లో మట్టి కొడుతున్నారని మండిపడ్డారు. వ్యవసాయమంటే తెలియని కన్నబాబుకు వ్యవసాయ శాఖ, నీటిపారుదల పదానికి అర్థం తెలియని అనిల్ కుమార్ నీటిపారుదల శాఖ అప్పగించారని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం రైతు పథకం కింద రైతులకు 20వేల ట్రాక్టర్లను పంపిణీ చేసిందన్న సోమిరెడ్డి.. వైసీపీ సర్కారు కనీసం ఒక్క నాగలి కూడా ఇవ్వలేదన్నారు. వ్యవసాయ రంగానికి, రైతులకు సంబంధించిన ఏ పథకంలోనైనా జగన్ సర్కారు దేశంలో ముందంజలో ఉందా? అని సోమిరెడ్డి నిలదీశారు. టీడీపీ హయాంలో రైతులు అన్ని విధాలుగా అండగా ఉన్నామన్నారు.