కాకినాడ: కో ఆఫ్షన్ అభ్యర్థుల ఎంపికపై నేతల మధ్య చిచ్చు, కారణమిదే!
కాకినాడ: కాకినాడ కార్పోరేషన్ కో ఆప్షన్ పదవి విషయమై టిడిపి మల్లగుల్లాలు పడుతోంది. ఐదు పదవుల కోసం పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక విషయమై కసరత్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో టిడిపి, బిజెపి కూటమి ఘన విజయం సాధించింది.ఈ ఎన్నికల్లో వైసీపీ ఆశించిన ఫలితాలను సాధించలేదు. అయితే ఈ పరిస్థితుల్లో కో ఆప్షన్ పదవుల కోసం అభ్యర్థులను ఎంపిక చేసే విషయమై పార్టీ నాయకత్వం తర్జన భర్జన పడుతోంది
కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పార్టీ అధిష్టానం సూచించిన పేరును వ్యతిరేకిస్తున్నారని ప్రచారం సాగుతోంది. అయితే స్థానికంగా ప్రజా ప్రతినిధుల మధ్య సమన్వయం లేకపోవడం కూడ ఇబ్బందులకు గురిచేస్తోందని కొందరు పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
కాకినాడ కార్పోరేషన్ కో ఆప్షన్ ఎన్నికపై తేలని నిర్ణయం
కాకినాడ కార్పోరేషన్ కో ఆప్షన్ ఎన్నిక కో ఆప్షన్ ఎన్నిక టీడీపీలో చిచ్చు రేపుతోంది.ప్రధానంగా కమ్మ సామాజికవర్గానికి, ముస్లిం మైనార్టీ వర్గానికి కో-ఆప్షన్ ఇచ్చే సభ్యత్వం అంశంపైనే వివాదం నడుస్తోంది.కమ్మ వర్గానికి కో-ఆప్షన్ ఇవ్వాలని ఇప్పటికే హైకమాండ్ నిర్ణ యం తీసుకోగా, ఇందుకు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ససేమిరా అంటున్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై ఏం చేయాలనే దానిపై పార్టీ నాయకత్వం చర్చిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తన వర్గీయులకు కూడ పదవులు దక్కాలంటున్న పిల్లి అనంతలక్ష్మి
కాకినాడ కార్పోరేషన్ ఐదు కో ఆప్షన్ పదవులపై టిడిపి నేతల మధ్య సమన్వయం కుదరడం లేదు. కాకినాడ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తన వర్గీయులకే అన్ని పదవులు దక్కించుకొనే ప్రయత్నం చేస్తున్నారనే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి భావిస్తున్నారు. తన వర్గీయులకు కూడ పదవులు దక్కేలా అనంతలక్ష్మి ప్లాన్ చేస్తున్నారు.దీంతో ఏం చేయాలోననే టిడిపి నాయకత్వం డైలమాలో పడింది.
కో ఆప్షన్ పదవిపై ఎమ్మెల్యే ప్రయత్నాలపై
కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల సమయంలో కమ్మ సామాజికవర్గానికి కో ఆప్షన్ పదవిని కేటాయించనున్నట్టు టిడిపి నాయకత్వం హమీ ఇచ్చింది. ఈ మేరకు ఆ సామాజిక వర్గానికి చెందిన మాజీ కార్పొరేటర్ ముళ్ళపూడి రాంబాబు కో-ఆప్షన్ పదవి కోసం దరఖాస్తు చేశారు.అయితే రాంబాబు అభ్యర్థిత్వాన్ని కొండబాబు వ్యతిరేకిస్తున్నారు.ప్రత్యామ్నాయంగా అదే సామాజికవర్గానికి చెందిన పుచ్చకాయల మహాలక్ష్మిని తెరపైకి తెచ్చారు. చివరి క్షణంలో ఆమె దరఖాస్తు సాంకేతికంగా చెల్లదని తేలింది. దీంతో ఇప్పుడు ముళ్ళపూడి రాంబాబుకు పదవి ఇవ్వక తప్పని పరిస్థితి ఎదురవుతుందని అంటున్నారు.
పోటీ చేసి ఓటమి పాలైన వారికి నో ఛాన్స్
ఇటీవల కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి కో-ఆప్షన్ అవకాశం లేదంటూ పార్టీ నేతలు పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు.మాజీ కార్పొరేటర్లు యాళ్ళ రామకృష్ణ, శీకోటి అప్పలకొండ, మాజీ కౌన్సిలర్ గుండవరపు శాంతకుమారికి కో-ఆప్షన్ ఇచ్చేందుకు దాదాపు ఖరారు చేశారని తెలుస్తోంది. మాజీ కౌన్సిలర్లు గుత్తుల రమణ, చింతపల్లి చంద్రశేఖర్, జీవీఎస్ శర్మ, కింతాడ వెంకట్రావు, కడారి భవాని, రాయుడు కనకదుర్గారత్నం కూడా పదవిని ఆశిస్తున్నారు. అయితే కో ఆప్షన్ పదవులు ఎవరికీ దక్కుతాయోననేది ఇంకా స్పష్టత రాలేదు.