జగన్, కెసిఆర్కు రివర్స్: సర్వేలో బాబు, కాంగ్రెస్ జోరు
న్యూఢిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికలలో సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ హవా కొనసాగనుందట. ఇరు ప్రాంతాల్లో కలిపి తెలుగుదేశం పార్టీ అత్యధిక లోకసభ స్థానాలను గెలుచుకుంటుందట. ఒక్క నెల రోజుల్లోనే సీమాంధ్రలో టిడిపి, జగన్ పార్టీ బలాబలాలు తారుమారైనట్లు మంగళవారం విడుదలైన లోక్నీతి-సిఎన్ఎన్, ఐబిఎన్ సర్వే తేల్చింది. ఇప్పుడు ఎన్డీటీవీ సర్వే కూడా ద్రువీకరించింది.
సీమాంధ్రలో జగన్ ధమాకా అని మార్చి 14వ తేదీన ప్రకటించిన ఎన్డిటివి సర్వే.. కేవలం 20 రోజుల్లోనే గణనీయంగా పుంజుకున్న చంద్రబాబు అని ప్రకటించింది. సీమాంధ్ర, తెలంగాణల్లో నిర్వహించిన సర్వే ఫలితాలను ఎన్డిటివి గురువారం రాత్రి వెల్లడించింది. సీమాంధ్రలో సీన్ రివర్స్ అయినట్లు తేల్చింది.
ఈ ప్రాంతంలోని 25 లోకసభ స్థానాల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ 15, తెలుగుదేశం, బిజెపిలు కలిసి 9, కాంగ్రెస్ ఒక స్థానంలో గెలుస్తాయని గత నెలలో జరిపిన సర్వేలో ఎన్డిటివి పేర్కొంది. ఇప్పుడు ఈ పరిస్థితి తారుమారు అయింది. టిడిపి - బిజెపిల కూటమికి 14 స్థానాలు దక్కుతాయని తేల్చింది.
జగన్ పార్టీ 10 స్థానాలకు పరిమితం అవుతుందని తెలిపింది. కాంగ్రెస్ అప్పుడూ, ఇప్పుడూ ఒక స్థానానికే పరిమితమైంది. ఓట్ల విషయానికి వస్తే... సీమాంధ్రలో జగన్ పార్టీ 43 శాతం ఓట్లు తెచ్చుకుంటుందని గతనెలలో చేసిన సర్వేలో ఎన్డిటివి వెల్లడించింది. ఇప్పుడు అది 38 శాతానికి తగ్గింది. టిడిపి ఓట్ల వాటా 43 నుంచి 46 శాతానికి పెరిగింది. మరోవైపు కాంగ్రెస్ ఓట్ షేర్ 10 శాతం నుంచి 14 శాతానికి పెరిగినట్లు ఈ సర్వే పేర్కొనడం గమనార్హం.
తెలంగాణ విషయానికి వస్తే.. పార్టీల బలాబలాలు క్రమంగా మారుతున్నట్లు సర్వే తేల్చింది. టిడిపి బలం పుంజుకుంటున్నట్లు పేర్కొంది. 20 రోజుల కిందట విడుదల చేసిన సర్వేలో టిడిపి, బిజెపి ఒక్కసీటూ గెలుచుకోలేవని తెలిపింది. ఇప్పుడు ఈ కూటమి రెండు చోట్ల నెగ్గే అవకాశమున్నట్లు స్పష్టం చేసింది. అనూహ్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి బలం పడిపోయి, కాంగ్రెస్ ఊపందుకుంటున్నట్లు తెలిపింది. గత సర్వేలో తెరాసకు 11, కాంగ్రెస్కు 5 ఎంపీ స్థానాలు వస్తాయని తెలిపింది.
ఇప్పుడు ఈ రెండు పార్టీలు చెరో ఏడు స్థానాలు దక్కించుకునే అవకాశమున్నట్లు అంచనా వేసింది. తెరాస, కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుంటే తెలంగాణలో క్లీన్ స్వీప్ ఖాయమని ఈ సర్వే గతంలో తెలిపింది. తెలంగాణకు సంబంధించి 20 రోజులక్రితం చేసిన సర్వేలో తెరాసకు 33 శాతం, కాంగ్రెస్కు 27 శాతం ఓట్లు రావొచ్చని అంచనా వేసింది. ఇప్పుడు ఇరు పార్టీల మధ్య హోరాహోరీ నెలకొందని రెండు పార్టీలకు చెరో 30 శాతం ఓట్లు తెచ్చుకుంటాయని పేర్కొంది. ఇక టిడిపి-బిజెపిలు పొత్తుతో వెళ్తే బలం 15 నుంచి 22 శాతానికి పెరిగింది.