టీడీపీకి గవర్నర్ పదవి, లిస్టులో - చంద్రబాబు ఛాయిస్..!!
బీజేపీ నాయకత్వం ఢిల్లీ కేంద్రంగా కీలక నిర్ణయాల పై కసరత్తు చేస్తోంది. బీజేపీ పార్టీ - కేంద్ర ప్రభుత్వంలో ప్రక్షాళనకు సిద్దమైంది. ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణతో పాటుగా కొత్తగా అయిదు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం పైన చర్చలు చేస్తోంది. కొత్త గవర్నర్ల నియామకంలో మిత్రపక్షం టీడీపీకి ఒక పదవి ఇవ్వాలని బీజేపీ అధినాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు టీడీపీ నుంచి ఎవరికి అవకాశం దక్కుతుందీ.. చంద్రబాబు ఛాయిస్ ఎవరనే చర్చ పార్టీలో మొదలైంది. ఇద్దరి పేర్లు టీడీపీ నుంచి ఈ పదవి కోసం ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
గవర్నర్ పదవి
గతంలో ఇచ్చి అమలు చేయని హామీ ఇప్పుడు పూర్తి చేసేందుకు బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా త్వరలో జరిగే గవర్నర్ల నియామకంలో మిత్రపక్షం టీడీపీకి ఒక పదవి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ నుంచి ఇద్దరికి అవకాశం దక్కింది. ఏపీ మంత్రివర్గంలోనూ బీజేపీ భాగస్వామి అయింది. గవర్నర్ పదవి ఆఫర్ కేంద్రం నుంచి టీడీపీకి ఆఫర్ అందింది. టీడీపీ నుంచి పేరు సూచించాలని చంద్రబాబును కోరినట్లు సమాచారం. టీడీపీ నుంచి ఎవరికి చంద్రబాబు గవర్నర్ పేరు సూచిస్తారనేది పార్టీలో చర్చ జరుగుతోంది. టీడీపీ నుంచి ఇద్దరి పేర్లు ప్రముఖంగా రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

బీజేపీ ఆఫర్ తో
రేసులో సీనియర్ నేతలు అశోక్ గజపతిరాజు, యనమల ఉన్నట్లు సమాచారం. ఈ ఇద్దరిలో ఒకరి పేరును చంద్రబాబు ఎంపిక చేసే అవకాశం ఉంది. అశోక్ గజపతి రాజు, యనమల తొలి నుంచి టీడీపీలో కీలకంగా వ్యవహరించారు. చంద్రబాబుకు తోడుగా నిలిచారు. ఇద్దరూ అసెంబ్లీ స్పీకర్లుగా..ఆర్దిక మంత్రులుగా వ్యవహరించారు. అశోక్ గజపతి రాజు కేంద్రంలోనూ టీడీపీ మంత్రిగా పని చేసారు. ప్రస్తుత ప్రభుత్వం లో ఇద్దరికీ ప్రాతినిధ్యం లేదు. ఇద్దరి కుమార్తెలు టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఈ మధ్యనే యనమల మండలి సభ్యుడుగా పదవీ విరమణ చేసారు. తనకు రాజ్యసభకు అవకాశం ఇస్తే కొనసాగుతానని.. లేకపోతే, రాజకీయాల నుంచి రిటైర్ అవుతానని యనమల స్పష్టం చేసారు.
చంద్రబాబు ఛాయిస్
ఇక, అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి ఇస్తే..యనమలకు రాజ్యసభ అవకాశం దక్కుతుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. 2014లో నాడు ఎన్డీఏలోనూ టీడీపీ భాగస్వామిగా ఉంది. అప్పుడు కూడా ఇదే రకంగా టీడీపీకి గవర్నర్ పదవి పైన ఆఫర్ అందింది. ఆ సమయంలో మోత్కుపల్లికి గవర్నర్ పదవి దక్కుతుందనే ప్రచారం సాగింది .కానీ, టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు రావటంతో ఆ పదవి దక్కలేదు. తెలుగు రాష్ట్రాల నుంచి గత పదేళ్ల కాలంలో విద్యాసాగర రావు, బండారు దత్తాత్రేయ, కంభంపాటి హరిబాబు, ఇంద్రసేనా రెడ్డికి గవర్నర్ పదవు లు దక్కాయి. ఇక, ఇప్పుడు టీడీపీ నుంచి చంద్రబాబు అధికారికంగా ఎవరి పేరు ఖరారు చేస్తారనేది చూడాల్సి ఉంది. చంద్రబాబు పార్టీలో చర్చించిన తరువాత నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications