ఇకముందు కూడా చూస్తారు: జూలకంటి బ్రహ్మారెడ్డి
మాచర్లలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు చూపించిన పట్టుదల, పౌరుషం ఇకముందు కూడా కొనసాగించాలని పార్టీ ఇన్ ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలకు ఆయన వీడియో సందేశం విడుదల చేశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు కాలమే సమాధానం చెబుతుందని, పోలీసులు పెట్టే కేసులకు భయపడేది లేదని జూలకంటి స్పష్టం చేశారు. శుక్రవారం నాటి ఘటనల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తనను కాపాడేందుకు చూపిన తాపత్రయాన్ని తాను జీవితంలో మర్చిపోలేనని, కార్యకర్తల కోసమే పనిచేస్తానన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నానని, ఇప్పుడు కార్యకర్తలకు నేరుగా అందుబాటులో ఉండలేకపోతున్నానని.. ఏదైనా ఇబ్బంది ఉంటే రాష్ట్ర పార్టీకి తెలియజేయాలని బ్రహ్మారెడ్డి సూచించారు.
మాచర్లలో గత శుక్రవారం రాత్రి వైసీపీ, తెలుగుదేశం శ్రేణుల మధ్య హోరాహోరీ పోరు నడిచింది. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో మాచర్ల ఇన్ ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. వీరికి ఎదురైన వైసీపీ శ్రేణులమధ్య మాటకు మాట పెరిగి విధ్వంసానికి దారితీసింది. జూలకంటి ఇల్లు (టీడీపీ కార్యాలయం), ఎర్రం పోలిరెడ్డితోపాటు పలువురు టీడీపీ నాయకుల ఇళ్లపై విధ్వంసానికి దిగారు. పోలిరెడ్డి నివాసంలో రూ.లక్ష నగదు, బంగారు ఆభరణాలు అపహరించారు. దీనిపై పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ చిన్న గొడవేనని, పెద్ది చేయాల్సిన అవసరం లేదనే అర్థంలో మాట్లాడటంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. జరిగిన గొడవను ఎస్పీ చిన్నది చేసి చూపిస్తున్నారని, ఆయన తన పదవికి రాజీనామా చేయాలని, లేదంటే ప్రభుత్వం తొలగించాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. మాచర్లలో జరిగిన విధ్వంసం రాష్ట్రవ్యాప్తగా చర్చనీయాంశమైంది.