చంద్రబాబు హైదరాబాద్లో ఇల్లు కట్టుకుంటే ఏం: జగన్కు ప్రజలపై నమ్మకం లేదు: మాజీ డిప్యూటీ సీఎం
పెద్దాపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విధించిన 48 గంటల గడువు సమీపిస్తోన్న కొద్దీ మాటల తూటాలు పేలుతున్నాయి. వైఎస్ జగన్ను టార్గెట్గా చేసుకుని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఘాటు విమర్శలను సంధిస్తున్నారు. సవాళ్లను విసురుతున్నారు. వైఎస్ జగన్కు ధైర్యం ఉంటే వెంటనే చంద్రబాబు విసిరిన సవాల్ను స్వీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. వైఎస్ జగన్కు ఏ మాత్రం ప్రజలపై, వారు ఇచ్చే తీర్పుపై నమ్మకం ఉన్నా వెంటనే వైఎస్ జగన్ అసెంబ్లీని రద్దు చేయాలని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప డిమాండ్ చేశారు.
ప్రజా తీర్పుపై జగన్కు నమ్మకం లేదని ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకుంటున్నందున తనకు ఓటమి తప్పదని జగన్ విశ్వసిస్తున్నారని ఎద్దేవా చేశారు. ప్రజాతీర్పు తనకు అనుకూలంగా వస్తుందనుకున్నప్పుడు ఎన్నికలకు ఎందుకు వెళ్లట్లేదని ప్రశ్నించారు. అమరావతి రాజధాని మార్పు అనేది అయిదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల సమస్య అని చినరాజప్ప వ్యాఖ్యానించారు. రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందాలంటే రాజధాని అమరావతిలోనే ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.

ప్రజల మనోభావాలకు విరుద్ధంగా 151 సీట్లు సాధించామనే గర్వంతోనే వైఎస్ జగన్ మొండిగా వెళ్తున్నారని, రాజధాని మార్పు నిర్ణయం తీసుకున్నారని ధ్వజమెత్తారు. అమరావతి రాజధానిగా కొనసాగుతుందని వైఎస్ జగన్ చెప్పారని, దాన్ని నమ్మి ప్రజలు వైసీపీని గెలిపించారని అన్నారు. మాట తప్పను, మడమ తిప్పను అని చెప్పుకొంటూ తిరిగే జగన్.. మాట తప్పారని విమర్శించారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా తీసుకొన్న ఈ నిర్ణయానికి సమాధానం చెప్పాలంటే చంద్రబాబు విసిరిన సవాల్ను స్వీకరించాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు అమరావతిలో ఇళ్లు కట్టుకోలేదంటూ వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతున్నారని, ఆయన హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నంత మాత్రాన అమరావతి అభివృద్ధి ఆగిపోయిందా? అని ప్రశ్నించారు. అమరావతి అభివృద్ధే తన బాధ్యతగా చంద్రబాబు స్వీకరించారని అన్నారు. అమరావతిని వరల్డ్ క్లాస్ రాజధానిగా తీర్చిదిద్డానికి రేయింబవళ్లు శ్రమించారని చెప్పారు. అంతర్జాతీయ స్థాయి డిజైన్లతో అమరావతిని ప్రజా రాజధానిగా మార్చాలని చంద్రబాబు తపన పడ్డారని చినరాజప్ప స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications