వైసిపి ఉంటేనే బాగుంటుంది: టిడిపి ఎమ్మెల్యే మోదుగుల, ఎందుకు అలా
అసెంబ్లీ సమావేశాలను వైసిపి బాయ్ కాట్ చేసిన నేపధ్యంలో సభలో పరిస్థితి గురించి టిడిపి నేత,గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి వివరించారు.
అమరావతి: నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను బయటపెట్టే టిడిపి ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. అసెంబ్లీ సమావేశాలను వైసిపి బహిష్కరించిన నేపధ్యంలో సభలో పరిస్థితిపై తనదైన శైలిలో కుండబద్దలు కొట్టారు.
నవంబర్ 10 న ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు శని, ఆదివారం సెలవుతో సోమవారం పున:ప్రారంభం కాగా మంగళవారం తో మౌడో రోజుకు చేరుకున్నాయి. అధికార పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలను వైసిపి బాయ్ కాట్ చేసిన నేపధ్యంలో సభలో పరిస్థితి గురించి టిడిపి నేత,గుంటూరు పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యుడు మోదుగుల వేణుగోపాలరెడ్డి వివరించారు.

ఆఫ్ ది రికార్డులో అంటున్నారు కానీ
సభలో వైసీపీ లేని లోటు స్పష్టంగా కనబడుతోందని టిడిపి ఎమ్మెల్యేలు పలువురు ఆఫ్ ది రికార్డులో అంటున్నా బహిరంగంగా ఆ మాట అనే రిస్క్ ఎవరూ తీసుకోలేదు. అయితే ఏ విషయం మీదైనా తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పేసే మోదుగుల మాత్రం ఈ విషయంలో కూడా తన స్పెషాలిటీ చాటుకున్నారు.

వైసీపీ లేకపోవడంతో చప్పగా
శాసన సభ సమావేశాలు జరుగుతున్న తీరుపై మోదుగుల అభిప్రాయాన్ని చెప్పాల్సిందిగా అడుగగా ఆయన వైసిపి గైర్హాజరు ఎఫెక్ట్ గురించి ఓపెన్ గా చెప్పేశారు. అసెంబ్లీలో వైసీపీ లేకపోవటంతో సమావేశాలు చప్పగా నడుస్తున్నాయని అనేశారు.

వైసీపీకి ప్రశ్న
అసెంబ్లీ అనేది ఆధునిక దేవాలయమని, ఇక్కడ ప్రజా సమస్యలు చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అయితే ప్రతిపక్షం లేకపోవడంతో సభ చప్పగా సాగుతున్నట్లు అనిపిస్తుందని చెప్పారు. మళ్ళీ 2018 లో బడ్జెట్ సెషన్స్ జరుగుతాయని, వాటిని కూడా ఇలాగే బహిష్కరిస్తారా అంటూ వైసీపీకి ప్రశ్నను సంధించారు.

మోదుగుల వ్యాఖ్యలకు ప్రాధాన్యత
కారణమేదైనా వైసిపి తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని, ఈ నిర్ణయంపై జగన్ పునరాలోచించాలని సూచించారు. సభలో ప్రతిపక్షం లేకపోయినా తామే ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యల గురించి చర్చ జరుపుతున్నామని తెలిపారు. అయితే మోదుగుల వైసిపిలో చేరడం ఖాయమంటూ కొందరు టిడిపి నేతలే వ్యాఖ్యనిస్తున్న నేపధ్యంలో మోదుగుల వ్యాఖ్యలను వారేవిధంగా విశ్లేషిస్తారో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications