కోనసీమ వద్దు, తూర్పే ముద్దు- టీడీపీ ఎమ్మెల్యే సరికొత్త డిమాండ్..!
ఏపీలో గతంలో వైసీపీ ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టింది. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతీ పార్లమెంట్ సీటును ఒక్కో జిల్లాగా మారుస్తూ పునర్విభజన పూర్తి చేసింది. దీంతో పాటు మరో జిల్లాను కూడా ఏర్పాటు చేసింది. దీంతో ఏపీలో జిల్లాల సంఖ్య 26కు చేరింది. అయితే ఆ తర్వాత కూడా కొత్త జిల్లాల డిమాండ్లు, జిల్లా కేంద్రాల మార్పు డిమాండ్లు, తమ నియోజకవర్గాల్ని పొరుగు జిల్లాల్లో కలపాలనే డిమాండ్ల వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఒకరు ఇలాంటి మరో డిమాండ్ ను తెరపైకి తెచ్చారు.
గతంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాను వైసీపీ హయాంలో నాలుగు జిల్లాలుగా చేశారు. దీంతో ఉమ్మడి జిల్లాల్లో ఉన్న 19 అసెంబ్లీ సీట్లు కాస్తా నాలుగు జిల్లాల్లోకి మారిపోయాయి. అప్పట్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాస్తా తూర్పుగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ జిల్లాలుగా మారడంతో పాటు ఏజెన్సీ సీటు అయిన రంపచోడవరం అల్లూరి సీతారామరాజు జిల్లాలోకి వెళ్లిపోయింది. ఇదే క్రమంలో మండపేట నియోజకవర్గం కోనసీమ జిల్లాలోకి వెళ్లింది.

ఇలా తూర్పు గోదావరి జిల్లా కేంద్రంగా మారిన రాజమండ్రికి సమీపంలోనే ఉన్న మండపేట నియోజకవర్గం కాస్తా బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోకి వెళ్లిపోయింది. దీన్ని తిరిగి తూర్పుగోదావరి జిల్లాలోకి చేర్చాలని అప్పట్లో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ ఎంత ప్రయత్నించినా, పోరాటాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు మరోసారి మండపేట టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఇదే డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. నిన్న అసెంబ్లీలో ఇదే విషయం ప్రస్తావిస్తూ కూటమి డిమాండ్ అయిన మండపేట నియోజకవర్గం మార్పును వెంటనే అమలు చేయాలని కోరారు. దీంతో ప్రభుత్వం ఇరుకునపడుతోంది.












Click it and Unblock the Notifications