సాయంత్రం 4గంటల్లోగా నీ అంతు చూస్తా!: బూతు పురాణంతో రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే?
పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం నిర్వహించవద్దంటూ అడ్డుకున్నందుకు బూతు పురాణం అందుకున్నారట.
కాకినాడ: కాకినాడ కార్పోరేషన్ ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు(కొండబాబు) నిబంధనలను ఉల్లంఘించి మరీ వైసీపీ నేతల మీద జులుం ప్రదర్శించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బూత్ ల్లోకి వెళ్లి ప్రచారం చేయడమే కాకుండా.. అడ్డుకున్న వైసీపీ నేతలపై బూతు పురాణం వదిలారట.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఎమ్మెల్యే సోదరుడైన సత్యనారాయణ కుమారులు ఉమాశంకర్, ప్రసాద్.. 14, 23వ డివిజన్ లలో పోటీ చేశారు. 14వ డివిజన్ నుంచి వైసీపీ అభ్యర్థిగా అంకడి సత్తిబాబు బరిలో దిగారు. అయితే సత్తిబాబును ఓడగొట్టడానికి ఎమ్మెల్యే కొండబాబు ప్రలోభాలకు దిగాడని వైసీపీ సభ్యులు ఆరోపిస్తున్నారు.
పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం నిర్వహించరాదన్న నిబంధనలు ఉన్నప్పటికీ.. 14వ డివిజన్ వద్ద కొండబాబుప్రచారం నిర్వహించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆయనకు అడ్డుపడినందుకు 'సాయంత్రం నాలుగు గంటల్లోపు నీ అంతు చూస్తా' అంటూ సత్తిబాబును బెదిరించారట. అక్కడితో ఆగకుండా బూతు పురాణం కూడా అందుకున్నారని సత్తిబాబు వర్గీయులు చెబుతున్నారు.
ఎన్నికలవేళ ఓటర్లను ప్రలోభ పెట్టేలా కొండబాబు వ్యవహరించారని, అన్ని పోలింగ్ కేంద్రాల వద్దకు తిరుగుతూ సైకిల్ గుర్తుకే ఓట్లు వేయాలని ప్రచారం చేశారని వైసీపీ ఆరోపణలు చేస్తోంది.