'చెల్లెల్ని ఇంట్లో కూర్చోబెట్టి రోజా కోసం జగన్ పోరాటం'
హైదరాబాద్: వైసీపీ ఎమ్మెల్యే రోజాను సభలోకి అనుమతించాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్యేలు నల్ల దుస్తులు ధరించి అసెంబ్లీకి హాజరయ్యారు. స్పీకర్ అధ్యక్షతన సభ ప్రారంభం కాగానే నిరసన వ్యక్తం చేస్తూ పోడియాన్ని చుట్టుముట్టారు. దీంతో సభను రెండు సార్లు వాయిదా వేయాల్సి వచ్చింది.
సభ జరగకుండా సభా కార్యక్రమాలను అడ్డుకున్న వైసీపీ సభ్యుల తీరుపై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యే రోజా దళిత మంత్రి, ఎమ్మెల్యేలను అవమానించారని ఆమె ఆరోపించారు.
రోజాకు ఇప్పుడు విధించిన శిక్ష చాలా చిన్నదని, ఇలానే చేస్తే భవిష్యత్తులో మరింత కష్టాలను ఆమె చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. అసెంబ్లీలో రోజా ప్రవర్తనను కోర్టు సమర్థించడం లేదని చెప్పిందని ఆమె పేర్కొన్నారు. రోజా వ్యాఖ్యలను ఏ మహిళా సమర్దించదని, ఏ ఒక్కరు సమర్ధించినా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు.
మరోవైపు సభలో వైసీపీ సభ్యులను ప్రతిపక్ష నేత వైయస్ జగన్ రెచ్చగొడుతున్నారని గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ సభలో బీజేపీ నేత మాట్లాడుతుంటే ఆయనపై దాడికి ఉసుగొల్పుతున్నారని ఆరోపించారు.

సభలో వైసీపీ వైఖరిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. సభలో ప్రతిపక్ష నేత జగన్ అరాచకవాదాన్ని ప్రదర్శిస్తున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాగా, అసెంబ్లీలో బీజేఎల్పీ నేత విష్ణుకుమార్రాజు మాట్లాడుతూ ఏపీ అభివృద్ధిని వైసీపీ అడ్డుకోవాలని చూస్తోందన్నారు.
అసెంబ్లీలో సభ్యుల ప్రసంగాన్ని అడ్డుకోకూడదన్న ఇంగిత జ్ఞానం కూడా వైసీపీ సభ్యులకు లేదని ఆయన ఆరోపించారు. మనకు దౌర్భాగ్యమైన ప్రతిపక్షం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్యే కూన రవి ప్రతిపక్ష నేత వైయస్ జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వైసీపీకి రోజా నాయకురాలా? అంటూ ప్రశ్నించారు. చెల్లిని ఇంట్లో కూర్చోబెట్టి రోజా కోసం వైయస్ జగన్ పోరాటం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక బొండ ఉమామహేశ్వరరావు అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ వైయస్
జగన్ ఇలాగే ఉంటే పార్టీలో ఎవరూ మిగలరని హెచ్చరించారు. ప్రతిపక్ష నేతగా జగన్ పద్ధతి మార్చుకోవాలని సూచించారు.












Click it and Unblock the Notifications