కానీ ఇప్పుడే చెప్పలేం: బాబుకు బీజేపీ సోము వీర్రాజు ప్రశంస, ఎన్ని జన్మలెత్తినా: జ్యోతుల నెహ్రూ
అమరావతి: కాపులకు రిజర్వేషన్ కల్పించే బిల్లును ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదింప చేయడంపై బీజేపీ శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు స్పందించారు. మిత్రపక్షంగా ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని ఆయన చెప్పారు. అయితే ఈ బిల్లును 9వ షెడ్యూల్లో పెట్టే విషయమై పార్టీలో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు.
టి-టిడిపికి కాపు సెగ!: రిజైన్ చేస్తా.. బాబుకు ఆర్ కృష్ణయ్య షాక్, 'జగన్ దురదృష్టవంతుడు'
బిల్లును కేంద్రానికి పంపించడం, 9వ షెడ్యూల్లో పెట్టడం, అక్కడ ఏమవుతుందో అన్న విషయాలను ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించడాన్ని స్వాగతిస్తున్నామని మరో బీజేపీ నేత మాధవ్ అన్నారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉండగా, వాటిపై అసెంబ్లీలో చర్చ జరగడం లేదన్నారు. అధికార టీడీపీ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రశంసించేందుకే సమయం సరిపోయందన్నారు.
అదే సవాల్
బీసీ కమిషన్ ఛైర్మన్ మంజునాథ నిర్ణయం వెల్లడి కాలేదని, ఆర్థికంగా వెనకబడిన వారికి 8 శాతం ఇవ్వాలంటున్నారని చెబుతున్నారని, ఆయన అభిప్రాయం తీసుకుని ప్రకటిస్తే బాగుండేదని మాధవ్ అన్నారు. రాజ్యాంగ చిక్కులు లేకుండా దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారనేదే సవాలు అని అభిప్రాయపడ్డారు.
బీజేపీ నేతలు ఒక్క మాట చెప్పినా బాగుండేది
కాపు రిజర్వేషన్లకు కేంద్రం సహకరించి 9వ షెడ్యూలులో చేర్చాలని తెలుగుదేశం పార్టీ నేత తోట త్రిమూర్తులు అన్నారు. కాపు రిజర్వేషన్ల అంసంపై బీజేపీ సభ్యులు ఒక్క మాట చెబితే సంతోషించేవాళ్లమని వ్యాఖ్యానించారు. కేంద్రం దీనికి సహకరించాలన్నారు.
బీసీ ఎమ్మెల్యేగా చెబుతున్నా
కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తే బీసీలకు నష్టం జరుగుతుందని తెలంగాణకు చెందిన బీసీ నేత, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య రెచ్చగొడుతున్నారని, బీసీ ఎమ్మెల్యేగా చెబుతున్నా ఎలాంటి నష్టం ఉండదని బండారు సత్యనారాయణ అన్నారు.
2004లో వైయస్ రాజశేఖర రెడ్డి కాపులను బీసీల్లో చేర్చుతామని హామీనిచ్చి మాట తప్పారని, సీఎం మాట నిలబెట్టుకున్నారని మరో టిడిపి నేత రామానాయుడు అన్నారు.
జ్యోతుల నెహ్రూ ప్రశంస
కాపుల రిజర్వేషన్ల వల్ల బీసీలకు ఎలాంటి నష్టం లేదని, బీసీల నోటికాడి కూడు తీసే పనులు చంద్రబాబు ఎప్పుడూ చేయరని, ఈ సభలో 18 మంది కాపు ఎమ్మెల్యేలున్నారని, కాపుల పట్ల ముఖ్యమంత్రికున్న నిబద్ధతకు ఇది నిదర్శనం అని బోండా ఉమ అన్నారు. చంద్రబాబు మాటకు కట్టుబడి రిజర్వేషన్లు కల్పించారని, కాపులు ఎన్ని జన్మలు ఎత్తినా బాబుకు రుణపడి ఉంటారని జ్యోతుల నెహ్రు అన్నారు.