రాజమండ్రి:టీడీపీ పాదయాత్రలో అపశృతి...సొమ్మసిల్లి పడిపోయిన ఎమ్మెల్సీ అదిరెడ్డి అప్పారావు
రాజమండ్రి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కేంద్రం కుట్రచేస్తోందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ సోమవారం రాజమండ్రిలో చేపట్టిన పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది.
ఈ పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్సీ అదిరెడ్డి అప్పారావు ఉన్నట్టుండి తీవ్ర అస్వస్థతకు లోనై సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో టీడీపీ కార్యకర్తలు ఆయనను హుటూహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు స్థానిక టీడీపీ నేతలు తెలిపారు. మరోవైపు ఎపికి కేంద్రం అన్యాయం చేస్తోందంటూ విజయవాడలో టీడీపీ శ్రేణులు వినూత్న శైలిలో నిరసన ప్రదర్శన నిర్వహించాయి.
కేంద్రం తీరును నిరసిస్తూ విజయవాడలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో నల్ల చొక్కాలు ధరించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రోడ్డు పక్కన దోశలు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజలపై ప్రధాని మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంభిస్తోందని దుయ్యబట్టారు.
ఎపి అంటే మోడీ లెక్కలేని విధంగా వ్యవహరిస్తున్నారని...ఆయన తీరుకు నిరసనగా రాష్ట్రంలో ప్రతి ఒక్క తెలుగువాడు ఈ రోజున రోడ్డుమీదకు వచ్చిన నిరసన తెలుపుతున్నారని వివరించారు. రాష్ట్రంలో ఉన్న ఇతర రాజకీయ పార్టీల నేతల బలహీనతలను ఆసరాగా చేసుకొని...వారిని లోబరుచుకున్నారని ఆరోపించారు. చివరకు ప్రతిపక్ష పార్టీ వైసీపీని ఒక కోడికత్తి పార్టీగా మార్చేశారని ఎద్దేవా చేశారు.
ప్రతిపక్ష నేత జగన్ తనపై ఉన్న కేసులకు భయపడి, ప్రధాని మోడీ సంకలో దూరడంవల్లే వాళ్లను బలహీనపరచడంతో పాటుగా ఏపీ ప్రజలను కూడా హీనంగా చూస్తున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వ్యాఖ్యానించారు. ఎపికి సంబంధించి విభజన చట్టంలోని హామీలు నూటికి 90 శాతం అమలు చేశామని బీజేపీ నేతలు చెబుతున్నారని, వాస్తవానికి ఏ ఒక్క హామీని కేంద్రం అమలు చేయలేదన్నారు.
బీజేపీ నేతలు చెప్పేవన్నీ పచ్చి అబద్దాలని, అందుకే ప్రజలు ఆ పార్టీని వ్యతిరేకిస్తున్నారన్నారు. విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ అని చెప్పి మనల్ని మభ్యపెట్టారని గద్దె రామ్మోహన్ దుయ్యబట్టారు. బిజెపి చేసిన నమ్మకద్రోహం కారణంగానే చంద్రబాబు ఎన్డీయే నుంచి బయటకు వచ్చారని వివరించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం బీజేపీ పార్టీని తరిమి కొట్టాలని గద్దె రామ్మోహన్ ఈ సందర్భంగా పిలుపు ఇచ్చారు.