దివాలా కంపెనీతో కడప స్టీల్ ఒప్పందమా ? జగన్ సర్కార్ తీరుపై బీటెక్ రవి ఫైర్
ఏపీలోని కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం వైసీపీ సర్కారు చేసుకున్న ఒప్పందం బెడిసికొట్టే సూచనలు కనిపిస్తుండటంతో విపక్ష టీడీపీ విమర్శలకు దిగుతోంది. కడప స్టీల్ కోసం ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న బ్రిటన్కు చెందిన లిబర్టీ గ్రూప్ ఇప్పుడు దివాలా పరిస్ధితుల్లో ఉండటంతో వైసీపీ సర్కారు తీరుపై టీడీపీ నేత బీటెక్ రవి మండిపడ్డారు. కడప జిల్లాకే చెందిన రవి.. స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై జగన్ సర్కారు చిత్తశుద్ధిని ప్రశ్నించారు.
గతంలో కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం లిబర్టీ గ్రూప్తో చేసుకున్న ఒప్పందాన్ని జగన్ సర్కారు బయటపెట్టలేదని, అలాగే ఆ చీకటి ఒప్పందాన్ని కేబినెట్ ఆమోదించిందని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి విమర్శించారు. ఇప్పుడు ఆ దివాళా సంస్ధతో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఎలా పూర్తి చేయిస్తారని జగన్ సర్కారును బీటెక్ రవి ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్పై దృష్టి మళ్లించేందుకు కడప స్టీల్ ప్లాంట్ అంశాన్ని వైసీపీ తెరపైకి తెస్తోందన్నారు.

సొంత జిల్లాలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని సీఎం జగన్కు నిజంగా ఉంటే దివాళా తీసిన కంపెనీతో చీకటి ఒప్పందాలు చేసుకోరని బీటెక్ రవి విమర్శించారు. తన కుటుంబానికి చెందిన భారతీ సిమెంట్స్పై ఉన్న శ్రద్ధ, కడప స్టీల్ ప్లాంట్పై జగన్కు లేదన్నారు. లిబర్టీ గ్రూప్ పూర్వాపరాలు తెలుసుకోకుండా కేబినెట్ తీర్మానంతో భూమి, నీరు, విద్యుత్ ఎలా కేటాయించారని బీటెక్ రవి ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్పై సీఎం జగన్ ఏదో ఒకటి తేల్చకపోతే కడప జిల్లాలో విద్యార్ధులు, నిరుద్యోగులతో కలిసి పోరాటం చేస్తానని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications