చూస్తూ ఊరుకోం, బాబుకు చూపించాల్సిందే: వర్మకు రాజేంద్రప్రసాద్ హెచ్చరిక
అమరావతి: సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీఆర్పై బయోపిక్ తీసేందుకు వర్మ.. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అనుమతి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్కు ముందు చంద్రబాబు నుంచి అనుమతి తీసుకున్నట్లే.. సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత డైలాగ్ టు డైలాగ్.. చంద్రబాబుకు చూపించాలని అన్నారు. లేని పక్షంలో సినిమా తీసేశాను, విడుదల చేశానంటే.. చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
సినిమా వివాదాస్పదంగా తీస్తే రాంగోపాల్ వర్మ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. అయినా, రాంగోపాల్ వర్మ సినిమా అంటే తొలుత వివాదం రేపడం, ఆ తర్వాత తుస్సుమనిపించడం సాధారణమేనని రాజేంద్రప్రసాద్ అన్నారు.
కాగా, లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే టైటిల్తో ఎన్టీఆర్ జీవిత చరిత్రపై రాంగోపాల్ వర్మ సినిమా తీయబోతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాలో ఎలాంటి వివాదాలు చూపిస్తారోనని పలువురు ఆసక్తి, మరికొందరిలో ఆందోళన నెలకొంది.