ఏపీలో ఆలయాలపై దాడులు: ప్రధాని, హోంమంత్రి జోక్యం చేసుకోవాలంటూ గల్లా జయదేవ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దేవాలయాలపై దాడుల వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రి అమిత్ షా జోక్యం చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ కోరారు. సోమవారం ఆయన దేవాలయాలై దాడులు అంశాన్ని ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెండు ప్రముఖ దేవాలయాల్లోని రథాలను తగులబెట్టారని చెప్పడానికే చాలా బాధపడుతున్నానని తెలిపారు. ఆరు దశాబ్ధాల చరిత్ర కలిగిన అంతర్వేది శ్రీలక్ష్మీ నర్సింహస్వామి రథాన్ని సెప్టెంబర్ 7న, నెల్లూరు జిల్లాలోని ప్రసన్నవేంకటేశ్వరస్వామి రథానికి గత ఫిబ్రవరి 14న నిప్పుపెట్టారని తెలిపారు.

అంతేగాక, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఆరు ఆలయాల్లోని 23 దేవతా మూర్తుల విగ్రహాలను ఒక్కరోజులోనే ధ్వంసం చేశారని వివరించారు. ఈ ఘటనలపై ఇప్పటికీ కనీసం కేసు కూడా నమోదు కాలేదని, ఎవర్నీ అరెస్టూ చేయలేదని చెప్పారు.
ఇంతకుముందు ఆస్తుల వేలం నిర్ణయం తీసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ).. ప్రజల వ్యతిరేకతతో ఆఖరికి వెనక్కి తగ్గక తప్పలేదని అన్నారు. ఆలయాలు, హిందువుల మనోభావాలపై ఈ రకమైన దాడులు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని, ఈ ఘటనల్లో తక్షణమే ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా జోక్య చేసుకోవాలని, హిందువులకు న్యాయం చేయాలని ఎంపీ గల్లా జయదేవ్ కోరారు.
కాగా, ఏపీలో ఆలయాలపై దాడులకు నిరసనగా ఇప్పటికే బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. విజయవాడ ఆలయ ఘటన, తాజాగా, మంత్రి నాని వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. అంతేగాక, హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఆయనపై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం, జనసేన పార్టీలు కూడా ఈ ఘటనల నేపథ్యంలో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications