నా పేరు తల్చుకోకుండా ఉండలేరు: కేశినేని, పవన్పై రెచ్చిపోతున్న ఎంపీలు
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన తెలుగుదేశం పార్టీ నేతలు రెండు విధాలుగా మాట్లాడుతున్నారు. ఓ వైపు ప్రత్యేక హోదా పైన ఆయన వ్యాఖ్యలను స్వాగతిస్తూనే, మరోవైపు తమ పైన చేసిన వ్యాఖ్యలకు దుమ్మెత్తి పోస్తున్నారు.
మంత్రులు గంటా శ్రీనివాస్ రావు, పత్తిపాటి పుల్లారావు, ఎంపీలు కేశినేని నాని, అవంతి శ్రీనివాస్, జేసీ దివాకర్ రెడ్డి, కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎమ్మెల్యే బోండా ఉమ తదితరులు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పైన స్పందించారు.
పవన్ సభ వెనుక మరో కోణం, ఎన్నో అనుమానాలు
జేసీ దివాకర్ రెడ్డి, అవంతి శ్రీనివాస్లు పవన్ పైన విరుచుకు పడ్డారు. అదే సమయంలో మంత్రి గంటా వంటి వారు కొంత సంయమనం పాటించారు. ప్రత్యేక హోదా పైన పవన్ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని చెబుతున్నారు.
ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా పైన పవన్ మాట్లాడినందుకు ధన్యవాదాలు అన్నారు. ఓ విధంగా ఎంపీలు తీవ్రంగా స్పందిస్తుంటే, రాష్ట్ర నేతలు అంటే ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం ఒకింత సంయమనంతో స్పందిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ తిరుపతిలో చేసిన తన ప్రసంగంలో ప్రధానంగా ఎంపీలను టార్గెట్ చేశారు. ఎంపీలు ధనవంతులని, కాబట్టి వారిని చూసి తమకు హోదా ఇవ్వకుండా ఉండవద్దని చెబుతూ.. అవంతి శ్రీనివాస్, మురళీ మోహన్, కేశినేని నాని తదితరుల పేర్లను ప్రస్తావించారు.
టిడిపి నేతగా రాలేదు: పవన్ కళ్యాణ్ షాకివ్వడంతో ఎమ్మెల్యే, ఫ్యాన్స్కూ.
ఈ నేపథ్యంలో వారి నుంచి మాత్రం పవన్ తీవ్ర విమర్సలు ఎదుర్కొంటున్నారు. అసలు పవన్కు పార్లమెంటరీ వ్యవస్థ గురించి తెలుసా, ఆయన ఏదేదో మాట్లాడుతున్నారని జేసీ తీవ్రంగా విమర్శించారు. అసలు పవన్ కళ్యాణ్కు బుల్లెట్ కావాలా, బ్యాలెట్ కావాలా అని అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ కళ్యాణ్ ఏపీలో మాట్లాడాడు కాబట్టి సరిపోయిందని, తమిళనాడులో మాట్లాడి ఉంటే కాళ్లు చేతులు విరగ్గొట్టేవారని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ ఇన్నాళ్లు కుంభకర్ణుడిలా నిద్రించారని ధ్వజమెత్తారు.
విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా తీవ్రంగానే స్పందించారు. హిందీ, ఇంగ్లీష్ రాని విజయవాడ ఎంపీ కేశినేని నాని పార్లమెంటులో తెలుగులో మాట్లాడుతున్నారని, ప్రధానిని నిత్యమూ సార్ సార్ అని సంబోధిస్తూ రాష్ట్రానికి హోదాను గట్టిగా డిమాండ్ చేయడంలో విఫలమవుతున్నారని పవన్ అన్నారు.
దీనిపై ఓ టీవీ ఛానల్తో కేశినేని నాని స్పందించారు. పెద్దలను గౌరవించాలి కాబట్టే ప్రధానిని సార్ అని సంబోధిస్తున్నానని, తెలుగు ప్రజలకు అర్థం కావాలనే తెలుగులో మాట్లాడతానే తప్ప, తనకు ఇంగ్లీష్, హిందీ రాదని కాదన్నారు. తనకు ఆ భాషలు కూడా వచ్చునని చెప్పారు.
పవన్ కళ్యాణ్ ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా తన పేరును ఓసారి తలచుకుని ప్రజలకు తన నోటి ద్వారా గుర్తు చేస్తుంటారని ఎద్దేవా చేశారు. హోదాను తక్షణం తీసుకువచ్చేలా పవన్ కళ్యాణ్ వద్ద వ్యూహం ఉంటే వెంటనే బయటపెట్టాలన్నారు.
ఇలా ఊకదంపుడు ఉపన్యాసాలతో ఒరిగేదేమీ లేదన్నారు. హోదాపై పోరాటం అంటే రాష్ట్రంలో ధర్నాలు, రాస్తారోకోలు కాదని, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ ఇంటి ముందు సభ పెట్టాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ తలుపులు మూసి విభజన బిల్లును ఆమోదించుకుందని, ఆనాటి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వానికి ఉందన్నారు. పదవులు తమకు ముఖ్యం కాదని, సీఎం నిర్ణయం ఎప్పుడు తీసుకున్నా, తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు.
ఎంపీలే టార్గెట్!
పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా పైన మాట్లాడినప్పుడు ఎంపీలను, ప్రధానంగా టిడిపి ఎంపీలనే టార్గెట్ చేస్తున్నారు. దీంతో ఇది చర్చనీయాంశంగా మారింది. గతంలోను హోదా పైన పవన్ మాట్లాడినప్పుడు టిడిపి ఎంపీలనే టార్గెట్ చేశారు. ఈసారి అంతే. అయితే, ప్రత్యేక హోదా విషయంలో ఎంపీలే సభను స్తంభింప చేయాలి కాబట్టి ఆయన వారినే టార్గెట్ చేస్తున్నారని అంటున్నారు.