ఆ ముగ్గురూ ఉద్దరించింది ఇదేనా: బడ్జెట్తో అసలు విషయం అర్దమైంది: కేశినేని ట్వీట్ వెనుక..!
టీడీపీ నుండి బీజేపీలో చేరిన ఆ ముగ్గురు ఎంపీల పైన టీడీపీ నేత సీరియస్గా స్పందించారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఎటువంటి ప్రాధాన్యత లేకపోయినా ఆ ముగ్గురు స్పందించకపోవటం పైన విజయవాడ ఎంపీ కేశినేని వారి ముగ్గురిని లక్ష్యం చేసుకొని ట్వీట్ చేసారు. వాళ్లేదో ఏపీని ఉద్దరించటానికి బీజేపీలోకి వెళ్తున్నట్లు బిల్డప్ ఇచ్చారని విమర్శించారు . కానీ, వాళ్లను వారు ఉద్దరించుకోవటానికే బీజేపీలోకి వెళ్లిన విషయం ఇప్పుడు అర్దమైందని నాని ట్వీట్లో ఎద్దేవా చేసారు. కేశినేని నాని మాత్రమే కాదు..సోషల్ మీడియా వేదికగా ఆ ముగ్గురు లక్ష్యంగా మారారు.
కేశినేని నాని ట్వీట్ వెనుక..
ఏపీలో వైసీపీ గెలిచిన తరువాత విజయవాడ ఎంపీ కేశినేని నాటి టీడీపీలో జరుగుతున్న పరిణామాల మీద అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అందులో భాగంగా టీడీపీ పైన పలు ట్వీట్లు చేసారు. పార్టీ అధినేత చంద్రబాబు పిలిచి మాట్లా డిన తరువాత ఆయన కొద్ది రోజులు ట్వీట్లకు దూరంగా ఉన్నారు. ఇక, ఇప్పుడు తాజాగా టీడీపీ నుండి బీజేపీలోకి చేరిన ముగ్గురు ఎంపీలను ఉద్దేశించి ట్వీట్ చేసారు. మీరేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి బీజేపీలోకి వెళ్తున్నామని బిల్డప్ ఇచ్చారు.

కానీ, నిన్న బడ్జెట్ చూసాక ఈ రాష్ట్ర ప్రజలకు బాగా అర్థమైంది. ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి బీజేపీలోకి వెళ్లారో లేక మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి చేరారో అంటూ ట్వీట్ ద్వారా విమర్శించారు. కేంద్ర బడ్జెట్ పైన ఈ ముగ్గురూ ఇప్పటి వరకూ స్పందించ లేదు. ఇదే సమయంలో ఏపీ నుండి అన్ని పార్టీల నేతలు బీజేపీలో చేరుతారని ధీమాగా చెబుతున్నారు. అసలు నాని ఆ ముగ్గురినీ లక్ష్యంగా చేసుకోవటం పార్టీ విధానమా..లేక వ్యక్తిగతమా అనేది ఇప్పుడు సాగుతున్న చర్చ.
పార్టీలో కేశినేని ఒక్కరే..
ఆ ముగ్గురు రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరిన సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు విదేశాల్లో ఉన్నారు. కొందరు పార్టీ నేతలు వారి మీద విమర్శలు చేసినా ఆ తరువాతి రోజు నుండి ఒక్క మాట మాట్లాడ లేదు. చంద్రబాబు విదేశాల నుండి తిరిగి వచ్చిన తరువాత సైతం ఆ ముగ్గురు బీజేపీలో చేరిన అంశం పైన ఎక్కడా చర్చ జరగలేదు. ఆయన విదేశాల నుండి ట్వీట్లు చేయించటం మినహా ప్రత్యక్షంగా స్పందించలేదు.
ఒక దశలో చంద్రబాబు సూచనల మేరకే ఆ ముగ్గురూ టీడీపీ వీడి బీజేపీలో చేరారనే ఆరోపణలు వచ్చాయి. దీనికి సైతం చంద్రబాబు పార్టీ నేతల సమావేశంలో మాట్లాడినట్లుగా ఎక్కడా బయటకు రాలేదు. ఇక, పార్టీలో ఏం జరిగినా తాను ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడుతానని కేశినేని ఇప్పటికే స్పష్టం చేసారు. అందులో భాగంగానే ఇప్పుడు ఆ ముగ్గురు ఎంపీలు లక్ష్యంగా నాని ట్వీట్ చేసినట్లు కనిపిస్తోంది. టీడీపీ నేతలు వారి గురించి మాట్లాడని సమయంలో..నాని ఇప్పుడు చేసిన ట్వీట్ ద్వారా ఇది ఆరోపణలు వస్తున్నట్లుగా రాజీ ఫార్ములాలో భగంగానే జరిగిందా అనే అనుమానం మరింత బలంగా మారుతోంది.












Click it and Unblock the Notifications