కన్నాకు వేల కోట్ల డబ్బు ఎలా వచ్చింది:ఎంపి రాయపాటి;టీడీపీకి రాహుల్ ప్రధాని కావడం ఇష్టం లేదు:బైరెడ్డి
గుంటూరు:బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఒకపెద్ద అవినీతిపరుడని టీడీపీ ఎంపి రాయపాటి సాంబశివరావు ఆరోపించారు. గురువారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ బిజెపి ఎపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై విమర్శల వర్షం కురిపించారు.
రేకుల షెడ్డులో ఉండే కన్నా లక్ష్మీనారాయణకు వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ఎంపి రాయపాటి ప్రశ్నించారు. అసలు ముఖ్యమంత్రి చంద్రబాబును విమర్శించే అర్హత కన్నా లక్ష్మీనారాయణకు లేనేలేదన్నారు. విపక్షాల నేతలు జగన్, పవన్ కళ్యాణ్ కు ప్రజల్లో ఆదరణే లేదని...అందువల్ల మళ్లీ చంద్రబాబే ముఖ్యమంత్రి అవుతారని ఎంపి రాయపాటి విశ్లేషించారు.
తేల్చేసిన...ఎంపి రాయపాటి
కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు తెలంగాణ వరకే పరిమితమని ఎంపి రాయపాటి వెల్లడించారు. తాను, తన కుమారుడు ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమని ఎంపి రాయపాటి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తమ సీట్ల విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయమే తుది నిర్ణయమని తేల్చేశారు. అంతకుముందు తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగిలో జరిగిన బిజెపి సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును దుయ్యబట్టారు.
చంద్రబాబు ద్రోహి...కన్నా ధ్వజం
కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ది కార్యక్రమాల కోసం ఎపికి నిధులు పంపుతుంటే...చంద్రబాబు ఆ నిధులను జన్మభూమి కమిటీలతో వ్యాపారం చేయిస్తున్నారని కన్నా ఆరోపించారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని నిధులు ఎపికి ఇస్తుంటే ఆ నిధులను ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ స్వాహా చేసేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు రాష్ట్ర ద్రోహి అని...పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెసు అని పదే పదే కామెంట్ చేసే చంద్రబాబు ఈ రోజు అదే పార్టీతో ఎలా దోస్తీ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
టిడిపికి...ఇష్టం లేదు
ఇదిలావుంటే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని కావడం టీడీపీకి ఇష్టం లేదని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ రాయలసీమ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో జరిగిన విలేఖరుల సమావేశంలో బైరెడ్డి రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ మోడీ ప్రధాని అయినప్పటి నుంచి బీజేపీ విధానాలను ఎండగట్టింది ఒక్క కాంగ్రెస్ పార్టీయేనని చెప్పుకొచ్చారు. అయితే నాలుగేళ్లుగా బీజేపీతో అన్యోన్యంగా కాపురం చేసిన టీడీపీ ఇప్పుడు బీజేపీని వ్యతిరేకిస్తున్నట్లుగా తెరమీదకు వచ్చి ప్రధాని అభ్యర్థిని తామే నిర్ణయిస్తామని ప్రకటిస్తుండటం ఎంత వరకు కరెక్టని బైరెడ్డి ప్రశ్నించారు. అప్పుడూ ఇప్పుడూ ఎప్పడూ అన్ని రాష్ట్రాల్లో బీజేపీకి పట్టపగలు చుక్కలు చూపిస్తుంది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు.
లోకేష్ వ్యాఖ్యలు...హాస్యాస్పదం
మోడీ మీద కాంగ్రెస్ పార్టీ రాజకీయ యుద్ధం చేస్తోందని..ఈ యుద్దానికి అందరూ సహకరిస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఇంటికి పంపుదామన్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తొలి సంతకం ఎంపికి ప్రత్యేక హోదా మీదే ఉంటుందనే విషయాన్ని బైరెడ్డి మరోసారి గుర్తు చేశారు. అయితే దుబాయ్లో జరిగిన సమావేశంలో నారా లోకేష్ 2019 ఎన్నికల అనంతరం ప్రధాని అభ్యర్థిని చంద్రబాబు నాయుడు నిర్ణయిస్తారని చెప్పడం హాస్యాస్పదమని బైరెడ్డి మండిపడ్డారు. మంత్రి లోకేష్ తెలిసి మాట్లాడుతున్నాడో...తెలియక మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. లోకేష్ వివిధ దేశాలు తిరుగుతూ ఫొటోలకు ఫోజులు ఇవ్వటం చేస్తే చేయొచ్చు కాని అనవసర ప్రకటనలు చేయడం సరికాదని బైరెడ్డి తప్పుబట్టారు.