చంద్రబాబు లేకుండా అసెంబ్లీకి వెళ్లాలా ? వద్దా ? టీడీపీలో అంతర్మథనం- జగన్ తరహాలోనే?
ఏపీలో టీడీపీ అధికారంలో ఉండగా.. అసెంబ్లీలో తనకు మాట్లాడే సమయం ఇవ్వడం లేదని ఆరోపిస్తూ వివక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరించారు. వైసీపీ ఎమ్మెల్యేలతో సహా అసెంబ్లీకి దూరంగా ఉండిపోయారు. తిరిగి తాను అధికారంలోకి వచ్చాకే అసెంబ్లీకి వచ్చారు. ఇప్పుడు గత అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ప్రభుత్వ తీరుతో విపక్ష నేత చంద్రబాబు కూడా అదే తరహాలో బాయ్ కాట్ చేశారు. కానీ ఆయన మాత్రమే తిరిగి అధికారంలోకి వచ్చాకే అసెంబ్లీకి వస్తానని ప్రకటించారు. మరి టీడీపీ ఎమ్మెల్యేల పరిస్ధితి ఏంటి ?
వచ్చేనెలలో బడ్జెట్ సమావేశాలు
వచ్చే నెల 7 నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లుతో పాటు పలు కీలక బిల్లుల్ని ప్రవేశపెట్టేందుకు అధికార వైసీపీ రంగం సిద్ధం చేసుకుంటోంది. అలాగే అసెంబ్లీ బడ్డెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కసరత్తు చేస్తోంది. అయితే విపక్ష టీడీపీ మాత్రం సమస్యలతో సతమతం అవుతోంది. ముఖ్యంగా విపక్ష నేతగా ఉన్న చంద్రబాబు అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరించిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు కూడా బాయ్ కాట్ చేయాలా లేక హాజరు కావాలా అన్న దానిపై టీడీపీ మథనపడుతోంది.
బాయ్ కాట్ పై టీడీపీ అంతర్మథనం
ఈసారి అసెంబ్లీ బడ్డెట్ సమావేశాలు చాలా కీలకం కాబోతున్నాయి. బడ్డెట్ మాత్రమే కాదు మూడు రాజధానుల బిల్లు, ఇతర కీలక అంశాలు కూడా చర్చకు రాబోతున్నాయి. ఈ ఏడాది గడిస్తే వచ్చే ఏడాది నుంచి ఎన్నికల సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది. ఇలాంటి సమయంలో గతంలో అసెంబ్లీ సమావేశాల్ని బహిష్కరిస్తూ అధినేత చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కొనసాగేలా కనిపిస్తోంది.అయితే చంద్రబాబు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లాలా వద్దా అనే దానిపై టీడీపీలో అంతర్మథనం కొనసాగుతోంది.
అసెంబ్లీకి టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్తే?
అసెంబ్లీ సమావేశాల్ని చంద్రబాబు మాత్రమే బహిష్కరించారు. కాబట్టి మిగిలిన ఎమ్మెల్యేలు సభకు హాజరైతే బావుంటుందని పార్టీలో కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే గతానుభవాల్ని బట్టి చూస్తే సభలో చంద్రబాబు మాట్లాడేందుకే వైసీపీ ప్రభుత్వం అవకాశం ఇవ్వడం లేదు. అలాంటిది మిగతా ఎమ్మెల్యేలు మాట్లాడే అవకాశం దొరుకుతుందా అంటే అసాధ్యమే అంటున్నారు. దీంతో మొక్కుబడిగా అసెంబ్లీకి వెళ్లి మాట్లాడకుండా వైసీపీతో తిట్లు తినడం ఎందుకన్న భావన వ్యక్తమవుతోంది.
అసెంబ్లీకి వెళ్లకపోతే?
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీలో మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదనే కారణంతో వైఎస్ జగన్ సమావేశాల్ని బహిష్కరించేశారు. ఆ తర్వాత కూడా తిరిగి అసెంబ్లీకి రాలేదు. అదికారం వచ్చాకే తిరిగొచ్చారు. అప్పట్లో వైసీపీ అసెంబ్లీలో చర్చకు భయపడి పారిపోతోందని టీడీపీ ప్రచారం చేసేది. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీకి దూరంగా ఉండిపోతే అదే విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
అలాగే రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమైన బడ్డెట్ తో పాటు మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడుతుంటే అడ్డుకోవాల్సిన విపక్షం పారిపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న చర్చ కూడా పార్టీలో సాగుతోంది. దీంతో త్వరలో జరిగే టీడీఎల్పీ భేటీలో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.