త్వరలో టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ ! మండలి డిప్యూటీ ఛైర్ పర్సన్ తో మొదలు..!
ఏపీలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కూటమి సర్కార్ పాలనపై పూర్తిగా ఫోకస్ పెడుతోంది. అదే సమయంలో కూటమిలో పార్టీలు రాష్ట్రంలో మరింతగా బలపడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం తాజాగా కూటమిలోని జనసేన పార్టీ సభ్యత్వ నమోదు డ్రైవ్ ప్రారంభించగా.. ఇప్పుడు టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపుతోంది. అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి వాలిపోయే నేతలకు రాష్ట్రంలో కొదవలేకపోవడంతో పార్టీలోకి వచ్చే వైసీపీ నేతలకు ఆహ్వానం పలుకుతోంది.
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలువురు విపక్ష వైసీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మంత్రి నారా లోకేష్ ను కలిసి టీడీపీలో చేరేందుకు తమ ఆసక్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో వీరిలో ఎవరెవరిని చేర్చుకోవాలనే అంశంపై లోకేష్ కసరత్తు చేస్తున్నారు. మండలి డిప్యూటీ ఛైర్మన్ గా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానం ఇప్పటికే మంత్రి ఫరూక్ ను కలిసి టీడీపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఆమెతో పాటు పలువురు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరేందుకు సంకేతాలు ఇచ్చేస్తున్నారు.

దీంతో పాటు జిల్లా, మండల స్ధాయిలో నేతలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు కూడా టీడీపీలో చేరేందుకు స్థానిక అధికార పార్టీ నేతల్ని సంప్రదిస్తున్నారు. వీరిలో ఎవరెవరిని చేర్చుకోవాలనే దానిపై అధిష్టానం మథనం చేస్తోంది. ముఖ్యంగా వైసీపీ హయాంలో టీడీపీ క్యాడర్ ను టార్గెట్ చేసి వారిని ఎట్టి పరిస్ధితుల్లోనూ చేర్చుకోబోమని చెప్పేస్తున్నారు. అలాగే వైసీపీ హయాంలో అక్రమాలకు పాల్పడి ఇప్పుడు అధికార పార్టీ అండ కోసం పార్టీలో చేరేందుకు వచ్చే వారికీ నో ఎంట్రీ అంటున్నారు. వీరి మినహాయించి మిగిలిన నేతల్ని చేర్చుకోవడం ద్వారా స్దానిక ఎన్నికల నాటికి మరింతగా బలపడేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది.












Click it and Unblock the Notifications