వైసీపీలో ఆ ఎమ్మెల్యేల పై టీడీపీ గురి - ఆపరేషన్ షురూ, రివర్స్ గేమ్..!!
ఏపీలో ఎన్నికల వేళ ఇప్పుడు రాజ్యసభ పోరు కీలకంగా మారింది. ఎన్నికల ముందు అధికార వైసీపీకి షాక్ ఇవ్వాలని టీడీపీ భావిస్తోంది. ఇదే సమయంలో టీడీపీకి అవకాశం లేకుండా వైసీపీ రివర్స్ గేమ్ ప్రారంభించింది. ఈ సారి రాజ్యసభ ఎన్నికల్లొ మూడు సీట్లు గెలుచుకోవటం ద్వారా పెద్దల సభ టీడీపీకి ఉనికి లేకుండా చేసే అవకాశం సద్వినియోగం చేసుకోవాలనేది సీఎం జగన్ ప్లాన్. వైసీపీలో టికెట్ దక్కని వారి మద్దతుతో సీటు గెలుచుకొనే వ్యూహాలను ముమ్మరం చేసింది.
అసెంబ్లీ సమావేశాలు: ఈ నెల 5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలోనే ఏపీలో ఈ నెల 27న జరిగే రాజ్యసభ ఎన్నికల గురించి చర్చ మొదలైంది. మూడు స్థానాలను ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం శాసనసభలో సంఖ్యా బలం ఆధారంగా మూడు సీట్లు వైసీపీకి దక్కనున్నాయి.

దీని ద్వారా టీడీపీ రాజ్యసభలో పూర్తి ప్రాతినిధ్యం కోల్పోనుంది. దీంతో టీడీపీ అలర్ట్ అయింది. ఎన్నికల వేళ రాజ్యసభలో పార్టీకి అసలు ఉనికి లేకపోతే ప్రతికూల సంకేతలు వెళ్తాయని భావిస్తోంది. అదే సమయంలో ఎన్నికల ముందు ఒక రాజ్యసభ సీటు గెలుచుకోవటం ద్వారా వైసీపీ పైన నైతికంగా విజయం సాధించ వచ్చని లెక్కలు వేస్తోంది. అందులో భాగంగా కొత్త వ్యూహాలు మొదలు పెట్టింది.
రాజ్యసభ ఎన్నికలు: ఇప్పుడు సభలో టీడీపీకి పార్టీ వీడిన నలుగురు..వైసీపీ నుంచి మద్దతుగా నిలిచిన నలుగురిని పరిగణలోకి తీసుకుంటే పార్టీ బలం 23గా ఉంది. ఎమ్మెల్యే గంటా రాజీనామా ఆమోదంతో 22కి చేరింది. ఇందులో వైసీపీ రెబల్స్ పైన స్పీకర్ వేటు పడితే ఆ సంఖ్య 18కి చేరుతుంది. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నలుగురి పైనా వేటు తప్పదనే ప్రచారం సాగుతోంది.
అదే జరిగితే అసెంబ్లీలో సంఖ్య బలం 165కి చేరుతుంది. ముగ్గురు సభ్యుల గెలుపుకు ఒక్కొక్కరికి 55 మంది మద్దతు అవసరం అవుతుంది. టీడీపీ నుంచి 18 మంది ఉంటారు. మరో 37 మంది సభ్యుల బలం అవసరం అవుతుంది. ఇప్పటికే వైసీపీలో సీట్లు రాని కొందరు టీడీపీ, జనసేనతో టచ్ లోకి వెళ్లారు. పార్ధసారధి, ఆదిమూలం, వరప్రసాద్ వంటి వారితో పాటుగా మరో ముగ్గురు ఉన్నారని చెబుతున్నారు.

మారుతున్న లెక్కలు: రాజ్యసభ సీటు ఎలాగైనా గెలుచుకోవాలని భావిస్తున్న టీడీపీ నేతలు వైసీపీలో సీటు రాని నేతలతో సంప్రదింపులు ప్రారంభించారనే ప్రచారం మొదలైంది. టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కంభంపాటి రామ్మోహన్ రావును బరిలోకి దింపే అవకాశం ఉంది. ఇదే సమయంలో వైసీపీ అలర్ట్ అయింది. సీట్లు దక్కని వారికి భవిష్యత్ పదవుల పైన హామీ ఇస్తోంది.
టీడీపీలో టచ్ లోకి వెళ్లిన వారి కదలికలు గమనిస్తోంది. చివరి వరకు వేచి చూసి అవసరమైతే వారి పైన అనర్హత వేటు దిశగా ఫిర్యాదు చేసే అవకాశం ఉందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ టీడీపీకి అవకాశం ఇవ్వమని వైసీపీ నేతలు గట్టిగా చెబుతున్నారు. దీంతో, అసెంబ్లీ వేదికగా కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications