''బందరు లడ్డు'' కావాలంటున్న చంద్రబాబు?
ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు స్వగ్రామం ఉన్న ఊరే కాదు.. ఆ పార్టీకి కంచుకోట లాంటింది. కానీ గత ఎన్నికల్లో జగన్ హవాను ఎదుర్కోలేక చతికిలపడింది. ఈసారి అటువంటి పరిస్థితి రాకూడదని, ఎలాగైనా జిల్లావ్యాప్తంగా పసుపు జెండాను రెపరెపలాడించడంతోపాటు రెండు లోక్ సభ నియోజకవర్గాలను గెలుచుకొని కేంద్రంలో మంచి పలుకుబడి సంపాదించాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారు. వచ్చే ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకం కావడంతో అందుకు తగ్గ వ్యూహరచన చేసుకుంటున్నారు.

కృష్ణా జిల్లా నేతలపై చంద్రబాబు మండిపాటు
పార్టీలోని కృష్ణా జిల్లా సీనియర్ నేతలంతా ఐకమత్యంగా పనిచేయడంలేదని ఇటీవలి సమావేశంలో చంద్రబాబు మండిపడ్డారు. అవసరమైతే అందరినీ పక్కకు తప్పించి కొత్తవారికి సీట్లిస్తానని హెచ్చరించారు. ముఖ్యంగా చంద్రబాబు మచిలీపట్నం సీటు మీద గురిపెట్టారు. ఈ లోక్ సభ నియోజకవర్గం పరిధిలో పెనమలూరు, పెడన, అవనిగడ్డ, పామర్రు, గన్నవరం, గుడివాడ, మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో భారీ మార్పులకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు.

బాడిగ వారసురాలికేనా ఎంపీ సీటు
బందరు నుంచి ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ బాడిగ రామకృష్ణ కుమార్తె శ్రీదేవిని పోటీకి దింపుతారంటూ పార్టీలో ప్రచారం నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి 2004లో రామకృష్ణ ఎంపీగా గెలుపొందారు. నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టి మంచిపేరు సంపాదించారు. 2009లో ఓటమిపాలైన తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు దూరమయ్యారు. శ్రీదేవి గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. పెడన సీటును కోరుకున్నప్పటికీ కొన్ని కారణాలవల్ల అది దక్కలేదు. ఇప్పుడు బందరు ఎంపీగా నిలబెడతామని, సిద్ధంగా ఉండాలంటూ అధిష్టానం కబురు పంపింది.

పెడన నుంచి కొనకళ్ల కష్టమే
కొనకళ్ల పెడన నుంచి ఎమ్మెల్యేగా పోటీచేద్దామని ప్రయత్నాలు చేస్తున్నారుకానీ అధిష్టానం నుంచి ఏవిధమైన స్పందనా కానరాలేదు. పెడన మరోసారి కాగిత కృష్ణప్రసాద్ కే దక్కనుంది. ఎంపీగా పోటీచేయడానికి కొనకళ్ల నిరాకరిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత సముచిత రీతిలో నామినేటెడ్ పదవిని ఇచ్చే అవకాశం కనపడుతోంది. మచిలీపట్నం పరిధిలోని గౌడ సామాజికవర్గానికి చెందిన ఓట్లన్నీ పార్టీకి పడాలంటే కొనకళ్ల ఒక్కరే ఆధారం. తన సహజ స్వభావానికి విరుద్ధంగా ఎన్నికలకు ఏడాదిన్నర ముందుగానే అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వస్తోన్న చంద్రబాబు మచిలీపట్నం ఎంపీ విషయంలో స్పష్టత ఇవ్వాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications