జగన్ రెడ్డి అవినీతి, మోసాలపై 29వ తేదీన టీడీపీ సమరభేరి .. ఆందోళనలకు చంద్రబాబు పిలుపు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నియోజకవర్గ ఇన్చార్జి లు, ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు సీఎం జగన్మోహన్ రెడ్డి సంక్షేమం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని, ప్రజలకు జగన్ సర్కార్ ఇచ్చింది గోరంత దోచు కుంది మాత్రం కొండంత అంటూ చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

29వ తేదీన 175 నియోజక వర్గాలలో టీడీపీ ఆందోళన కార్యక్రమాలు
ఈనెల 29వ తేదీన 175 నియోజక వర్గాలలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్న చంద్రబాబు జగన్ రెడ్డి అవినీతి పై క్షేత్రస్థాయిలో పోరాటాలు చేస్తామని వెల్లడించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని,జగన్ రెడ్డి పాలనలో ఫ్యాక్షనిజం పడగ విప్పిందని పేర్కొన్న చంద్రబాబు రాష్ట్రంలో ఎక్కడ చూసినా రేప్ లు , సెటిల్మెంట్లు, ఫ్యాక్షన్ హత్యలు, గంజాయి స్మగ్లింగ్ లు రాజ్యమేలుతున్నాయి అంటూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

కరోనా నియంత్రణలో, వ్యాక్సినేషన్ లో ప్రభుత్వం వైఫల్యం
జగన్ సర్కార్ పై పోరాటం చేయాలని పేర్కొన్న చంద్రబాబు కరోనా నియంత్రణలో ను వ్యాక్సినేషన్ లోనూ ఏపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. వారం రోజులు టీకాలు వేయకుండా ఒక్కరోజు మాత్రమే టీకాలు వేసి ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చిన లెక్కల కంటే 14 రేట్లు ఎక్కువగా కరోనా మరణాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు అని చంద్రబాబు పేర్కొన్నారు.

రైతుల పరిస్థితి దయనీయం.. శాంతిభద్రతల వైఫల్యం
ఇదే సమయంలో రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, ఏపీ సర్కార్ ధాన్యం బకాయిలు చెల్లించలేదని, పంటలకు గిట్టుబాటు ధర లేదని మండిపడ్డారు. అసమర్థులను సలహాదారులుగా పెట్టుకొని రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. జగన్ రెడ్డి ఇంటి సమీపంలోని ఓ యువతి పై దారుణ అత్యాచారం జరిగితే శాంతిభద్రతలు ఎక్కడ ఉన్నట్టు చెప్పాలన్నారు. ఈ ఘటన శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమని చంద్రబాబు విమర్శించారు.

డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని జగన్ ప్రభుత్వం మోసం
డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేస్తామని చెప్పి జగన్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించిన చంద్రబాబు ఏపీలో చేయూత పేరుతో మోసం జరుగుతోందన్నారు. 45 ఏళ్లు దాటిన ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ మహిళలకు నెలకు మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఏమైంది అని ప్రశ్నించిన చంద్రబాబు మహిళలను మోసం చేయడం కోసం చేయూత పేరుతో జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వ అవినీతిని జగన్ రెడ్డి మోసాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్న చంద్రబాబు వైసీపీ శ్రేణులను ఆ దిశగా కార్యోన్ముఖుల్ని చేశారు.












Click it and Unblock the Notifications