జగన్ తిరిగిన చోట పసుపునీళ్లతో నేల శుద్ధి
గుంటూరు: రాజధాని ప్రాంతంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పర్యటించిన చోట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని కోసం రాష్ట్ర ప్రభుత్వం గుంటూరు జిల్లాలో చేపట్టిన భూసేకరణను వ్యతిరేకిస్తూ జగన్ ఆ ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.
జగన్ తీరును ఖండిస్తూ తెలుగు యువత ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు ఈ వినూత్న శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచంలోనే అద్భుతమైన రాజధానిని చంద్రబాబు నిర్మిస్తారని ఈ సందర్భంగా మాట్లాడిన తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మల్లి అన్నారు. జగన్ మాటలు నమ్మి ప్రజలు మోసపోరాదని అన్నారు.
వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సిఎం అయి ఉంటే, ఆకలిదప్పులు, నేరాలతో నలిగిపోయిన సోమాలియా దేశంలా ఏపీ మారేదని నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కోటంరెడ్డి నిప్పులు చెరిగారు. రాష్ట్రానికి కొత్త రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జగన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
ఇదే తీరు కొనసాగిస్తే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ను ప్రజలు క్షమించరని కోటంరెడ్డి మండిపడ్డారు. జగన్ ఒక బాధ్యతగల ప్రతిపక్షనేతగా వ్యవహరించాలని హితవు చెప్పారు. తమ పార్టీ ప్రభుత్వం వస్తే రాజధాని కోసం బలవంతంగా తీసుకున్న భూములను తిరిగి ఇప్పిస్తాన్ని జగన్ తన పర్యటనలో చెప్పిన విషయం తెలిసిందే.