45 ఏళ్లకే పింఛను పథకం ఏమైందన్న టీడీపీ.. హామీ ఇవ్వలేదన్న సీఎం..! సాక్ష్యాలతో ఇరుకున పడ్డ జగన్..!!
Recommended Video
అమరావతి/హైదరాబాద్ : ఏపీ శాసన సభలో తెలుగుదేశం పార్టీకి సంఖ్యబలం తక్కువగా ఉన్నప్పటికీ, అదికార పార్టీని విమర్శిస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఈరోజు అసెంబ్లీలో జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల గురించి చర్చ జరిగింది. ఈ సందర్భంగా జగన్ 45 సంవత్సరాలకే బడుగుబలహీన వర్గాలకు పింఛను ఇస్తాడని ప్రచారం చేసి జనాలతో ఓట్లేయించుకున్నారని కానీ ఆ మాట తప్పారని తెలుగుదేశం ఆరోపించింది. ఈ విమర్శపై జగన్ స్పందిస్తూ మా మేనిఫెస్టో చూడండి.. అది లేదు అని సమాధానం ఇవ్వడంతో సభలో గందరగోళం నెలకొంది.
పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీ..! మానిఫెస్టోలో లేదన్న సీఎం..!!
అయితే, మేనిఫెస్టో ఓటింగ్ కు కేవలం 10-12 రోజుల ముందు మాత్రమే ప్రకటించారు. దీంతో అప్పటికే వైసీపీ చెప్పినవన్నీ జనం నమ్మేశారు. అందులో అత్యధిక పేదలను ఆకర్షించిన పథకం 45కే ఏళ్ల పింఛను పథకం. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను, వైసీపీ వెబ్ సైట్ క్లిప్పింగులను, జగన్ ప్రచారం చేసిన వీడియోలను, వైసీపి పత్రిక క్లిప్పింగులను తెలుగుదేశం చూపించింది. డిఫెన్సులో పడిన వైసీపీ ఎమ్మెల్యేలు ఏం చేయాలో తెలియక చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులను ఎత్తిచూపడం మొదలుపెట్టారు. ముందు దీనికి సమాధానం చెప్పి మాట్లాడటమనడంతో అరుపులు, బెదిరింపులతో సభను స్తంభింపజేశారు.
ఆధారాలు చూపించిన ప్రతిపక్షం..! ఎదురుదాడి చేసిన అదికార పార్టీ సభ్యులు..!!
చివరకు ముగ్గురు సభ్యులను సస్పెండ్ చేశారు. వైసీపీ అణిచివేత విధానాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు వాకౌట్ చేశారు. ఆయనతో పాటు టీడీపీ సభ్యులు కూడా వాకౌట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఏపీ సర్కారుపై ధ్వజమెత్తారు. 'తామేమీ ప్రభుత్వంపై యుద్ధం చేయడానికి సభకు కత్తులు, కటార్లతో వెళ్లట్లేదని, వాళ్లు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తుంటే అసహనం వ్యక్తం చేస్తున్నారని అధికారపక్షంపై విమర్శలు చేశారు.
సహనం కోల్పోయిన ప్రతిపక్షం..! ప్రభుత్వ అసమర్థతను ఎండగడతామన్న టీడిపి..!!
బీసీ నాయకుడ్ని సభ నుంచి సస్పెండ్ చేసి బీసీ బిల్లు ప్రవేశపెట్టడాన్ని ఏ విధంగా చూడాలి. ప్రతిపక్ష డిప్యూటీ లీడర్ ను అకారణంగా సస్పెండ్ చేస్తే తామెలా ఊరికే కూర్చుంటామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రమంతటా అభద్రతా భావం నెలకొంటోందని, ప్రభుత్వంలో అసహనం బాగా పెరిగిపోతోందని పేర్కొన్నారు. భవిష్యత్ కార్యాచరణపై టీడీఎల్పీలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని' చంద్రబాబు ప్రకటించారు.
చంద్రబాబుపై జగన్ ఆగ్రహం..! పాలనకు అడ్డుతగులుతున్నారని ఆరోపణ..!!
ఇదిలా ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ముఖ్యమంత్రి జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో ప్రతి అంశాన్ని అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. మేనిఫెస్టోను తాము ప్రవిత్ర గ్రంథంగా చూస్తున్నామని అన్నారు. మేనిఫెస్టోను చూసే ప్రజలు తమను గెలిపించారని చెప్పారు. రబీలో రైతులను ఆదుకోవడానికి అక్టోబర్ లో పెట్టుబడి సాయం అందించాలనుకుంటున్నామని తెలిపారు. మంచి పని చేస్తున్న తమను అభినందించాల్సింది పోయి తమ వ్యాఖ్యలను వక్రీకరించే ప్రయత్నం చేస్తుస్తూ పదే పదే విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు మంచి చేయాలనే తపన చంద్రబాబుకు లేదని దుయ్యబట్టారు. సభలో అర్థవంతమైన చర్చ జరపాలనే ఉద్దేశం టీడీపీకి లేదని అన్నారు.