జగన్ను రమణదీక్షితులు కలవడంతో ఇన్నాళ్ల పూజలు వృథా అయ్యాయి: బుద్దా వెంకన్న
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని రమణదీక్షితులు కలవడంపై తెలుగుదేశం పార్టీ నేతలు మండిపడ్డారు. గురువారం వారిద్దరి భేటీ తెలియగానే ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న నిప్పులు చెరిగారు.
అలాగే, బీజేపీ నేతలు గవర్నర్ నరసింహన్ను కలవడంపై కూడా స్పందించారు బుద్ధా వెంకన్న. గవర్నర్ను బీజేపీ నేతలు కలవడం ఓ డ్రామా అన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టేందుకే తిరుమల తిరుపతి దేవస్థానం అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు.

జగన్ను రమణ దీక్షితులు కలవడం కుట్రలో భాగమే అన్నారు. జగన్ను రమణ దీక్షితులు కలవడంతో ఇన్నాళ్లు వెంకన్న స్వామికి చేసిన పూజలు వృథా అయ్యాయని విమర్శించారు. ఏపీ కేబినెట్లో బీజేపీ మంత్రులు ఉన్నప్పుడు అవినీతి కనబడలేదా అని ప్రశ్నిచారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుతో ప్రధాని నరేంద్ర మోడీ గ్రాఫ్ పడిపోయిందని చెప్పారు.
అంతకుముందు, బోండా ఉమ కూడా విమర్శలు గుప్పించారు. జగన్ను రమణ దీక్షితులు కలవడంపై తెలుగుదేశం పార్టీ నేత బోండా ఉమామహేశ్వర రావు మండిపడ్డారు. ఆయన రాజకీయ శక్తుల చేతిలో కీలుబొమ్మగా మారారని మడిపడ్డారు. బీజేపీ మహా కుట్రలో ఇది కూడా ఓ భాగం అన్నారు. తిరుమల వెళ్లినప్పుడు చంద్రబాబు రమణదీక్షితులును చాలాసార్లు కలిశారని చెప్పారు.
చంద్రబాబును అపాయింటుమెంట్ అడిగానని చెప్పడం అవాస్తవం అన్నారు. ఏ ఉద్దేశ్యంతో అంతకుముందు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాతో భేటీ అయ్యారని ప్రశ్నించారు. 30 ఏళ్లుగా స్వామివారి సేవలో ఉన్న ఆయన ఆఖరుకు వెంకన్నను కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారన్నారు.












Click it and Unblock the Notifications