రేవంత్ రెడ్డి అరెస్టు ఇష్యూకు ట్విస్ట్: జగన్పై టిడిపి ఎదురుదాడి
హైదరాబాద్: తమ పార్టీ తెలంగాణ శాసనసభ్యుడు నోటుకు ఓటు కేసులో అరెస్టయిన తర్వాత ఆత్మరక్షణలో పడినట్లు కనిపించిన తెలుగుదేశం పార్టీ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఎదురు దాడిని ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ టిడిపి నాయకులు జగన్పై బుధవారంనాడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నష్టం జరగకుండా జాగ్రత్త పడే క్రమంలో జగన్పై టిడిపి నాయకులు ఎదురుదాడికి దిగినట్లు కనిపిస్తున్నారు.
రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై కేసు నమోదు చేయాలని జగన్ గవర్నర్ను కలిసి వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే. గవర్నర్ను కలిసిన తర్వాత ఆయన చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ క్రమంలో టిడిపి నైతికంగా బలం కోల్పోయి, జగన్ అక్రమాస్తుల కేసుపై విమర్శలు చేసే స్థితిని కోల్పోయిందని మీడియా వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో టిడిపి నాయకులు జగన్పై ఎదురుదాడికి దిగడం గమనార్హం.
రేవంత్ రెడ్డి వ్యవహారం వేడిని తగ్గించేందుకు తెలుగుదేశం నాయకులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్కు మద్దతు ఇవ్వడాన్ని ఆసరా చేసుకుని విమర్శల దాడి పెంచారు. దానివల్ల ఆంధ్రప్రదేశ్లో పార్టీకి దెబ్బ తగలకుండా చూసుకునే ప్రయత్నంలో వారు పడినట్లు కనిపిస్తున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో పాటు మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు, టిడిపి నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుతో జగన్ కుమ్మక్కయ్యారని వారు ఆరోపిస్తున్నారు. అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న జగన్కు తనపై విమర్శలు చేసే అర్హత లేదని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు టిఆర్ఎస్కు ఓటేయడాన్ని ఆసరా చేసుకుని టిడిపి ఆ విమర్శలు చేస్తోంది.
సమైక్యవాదం వినిపించిన వైసిపి టిఆర్ఎస్కు ఓటేయడం అనైతికమని చంద్రబాబు అన్నారు. ఆస్తులను కాపాడుకోవడానికి జగన్ కెసిఆర్తో కుమ్మక్కయ్యారని దేవినేని ఉమామహేశ్వర రావు ఆరోపించారు. కాగా, టిఆర్ఎస్కు వైసిపి ఓటేసిన నేపథ్యంలో జగన్ను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీమాంధ్ర ద్రోహిగా అభివర్ణించారు.
జగన్ చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలనడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఆంధ్రప్రదేశ్ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. జగన్ త్వరలో జైల్లో దీక్ష చేసేందుకు సిద్ధం కావాలన్నారు. వైఎస్. జగన్ అక్రమాస్తులపై ప్రజాబ్యాలెట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పట్లో అధికారం రాదని తెలిసి ఓర్వలేక జగన్ దీక్ష చేస్తున్నారని, జగన్ కేసీఆర్ కనుసన్నల్లో నడుస్తున్నారని మంత్రి పుల్లారావు ఆరోపించారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సమరదీక్ష నేపథ్యంలో కూడా ఎపి టిడిపి నాయకులు విమర్శలకు దిగినట్లు కనిపిస్తున్నారు. చంద్రబాబుకు సమరదీక్ష వేదికగా జగన్ వంద ప్రశ్నలు సంధించారు.