తండ్రీకొడుకులు 3 లక్షల ఎకరాలు దోచుకున్నారు: జగన్ను ఏకేసిన టిడిపి
విశాఖపట్నం/ నెల్లూరు : రాష్ట్రంలో అసమర్థ, అభివృద్ధి నిరోధక ప్రతిపక్షం ఉందని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. బుధవారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని, సెజ్ల పేరుతో తండ్రీకొడుకులిద్దరూ మూడు లక్షల ఎకరాలను దోచుకున్నారని ఆయన జగన్ను విమర్శించారు.
రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డేనని, ఇప్పుడు ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు. వైఎస్ హయాంలో జగన్ బావ బ్రదర్ అనిల్కు లక్షా 40 వేల ఎకరాల బయ్యారం గనులను కట్టబెట్టారని, ఇప్పుడు అభివృద్ధికి భూములను రైతులే ఇస్తుంటే అనవసర రాద్ధాంతం చేస్తూ రాజకీయపబ్బం గడుపుకుంటున్నారని అన్నారు.
రాష్ర్టాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, రైల్వే జోన్, పరిశ్రమలు వంటివి తీసుకొచ్చేందుకు విశేషంగా కృషిచేస్తున్నారని అన్నారు. అభివృద్ధి కోసం రైతులు భూములు ఇస్తుంటే వారిని రెచ్చగొట్టేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు.
విపక్షాలు విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నాయని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ మండిపడ్డారు. బుధవారం నెల్లూరు జిల్లాలోని మన్సూర్నగర్ ప్రాంతంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకుంటున్నామన్నారు. కాలువల ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ తెలియజేశారు.
వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవడంలేదంటూ, ప్రభుత్వానికి మానవత్వమే లేదంటూ ప్రతిపక్షనేత జగన్ మంగళవారంలో నెల్లూరులో చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. బుధవారమిక్కడ ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు.
జగన్ వ్యాఖ్యలు అర్ధరహితమని అన్నారు. జగన్ ప్రవర్తన చూసిన వరంగల్ ప్రజలు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గుర్తింపు రద్దు చేస్తూ తీర్పు ఇచ్చారని, జగన్కు ఏపీలోనూ ఆ పరిస్థితే ఎదురవుతుందని ఆయన చెప్పారు.
వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు పట్టించుకోని జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం హాస్యాస్పదమని సోమిరెడ్డి అన్నారు.