సస్పెన్షన్ల కోసమే టీడీపీ పోరు - రాజకీయ మైలేజ్ దక్కేనా ! డిఫెన్స్ లో వైసీపీ ?
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగిపోతున్న పోరు ఈసారి అసెంబ్లీ బడ్డెట్ సమావేశాల్లో మరో మలుపు తిరిగింది. ఇప్పటివరకూ అసెంబ్లీలో నామమాత్రపు బలంతో ఉన్న టీడీపీని లెక్కచేయకుండా ముందుకు వెళ్తున్న వైసీపీ..ఈసారి మాత్రం ఆత్మరక్షణలో పడుతోంది. దీనికి కారణం టీడీపీ అనుసరిస్తున్న సస్పెన్షన్ల వ్యూహం. ప్రతీ రోజూ సభకు రావడం, కీలకమైన అంశాలపై చర్చకు పట్టుబట్టడం, ప్రభుత్వం దానికి అంగీకరించకపోవడం, చివరికి నిరసనలు తెలుపుతున్న టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేయడం సర్వసాధారణమవుతోంది.
వైసీపీ వర్సెస్ టీడీపీ
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటివరకూ అసెంబ్లీ వేదికగా తమ వాయిస్ పినిపించడమే లక్ష్యంగా వ్యూహాలు రచించిన టీడీపీ.. అధికార వైసీపీ వైఖరితో రూటు మార్చుకుంటోంది. తమకు ఎలాగో మాట్లాడే అవకాశం దక్కదని ముందుగానే డిసైడ్ అయిపోతున్న టీడీపీ సభ్యులు... ప్రత్యామ్నాయంగా ప్రజల దృష్టిని తాత్కాలికంగా అయినా తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో అసెంబ్లీ,మండలిలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది.
కావాలనే సస్పెన్షన్లు
ఏపీ అసెంబ్లీ, మండలిలో టీడీపీ సభ్యులు వైసీపీ సర్కార్ కు వ్యతిరేకంగా గతంలో ఎన్నడూ లేని విధంగా చిత్ర విచిత్ర పద్ధతుల్లో నిరసనకు దిగుతున్నారు. చట్టసభల గౌరవం, ప్రతిష్టల్ని సైతం లెక్కచేయకుండా ప్రజల దృష్టిలో పడాలన్న ఆతృత వారిలో కనిపిస్తోంది. దీంతో నిత్యం అసెంబ్లీ, మండలిలో నిరసనలకు దిగడం, సస్పెన్షన్ కు గురయ్యే పర్వం కొనసాగుతోంది. తద్వారా ఏదో విధంగా ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ సభ్యులు చెప్తున్న దాని ప్రకారం చూసినా టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉద్దేశపూర్వకంగానే సభలో సస్పెన్షన్లకు గురయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.
రాజకీయంగా మైలేజ్ దక్కేనా ?
అసెంబ్లీ, మండలిలో రోజూ ఏదో ఒక అంశంపై నిరసనకు దిగడం, సస్పెండ్ కావడం ద్వారా ఏదో విధంగా ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు, తద్వారా వైసీపీపై పైచేయి సాధించేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. అయితే అదే సమయంలో ప్రజా సమస్యలపై చర్చకు బదులుగా నిరసనలతో హంగామా చేయడం ద్వారా తాత్కాలికంగా ప్రజల దృష్టి తమపై పడినా అంతిమంగా చెడ్డపేరు రావడం ఖాయంగా కనిపిస్తోంది. అయినా లెక్కచేయకుండా అసెంబ్లీ, మండలిలో నిరసనల పర్వం కొనసాగించేందుకే టీడీపీ మొగ్గు చూపుతోంది.
డిఫెన్స్ లో వైసీపీ !
అసెంబ్లీ, మండలిలో ఉన్న ప్రధాన విపక్షం టీడీపీని అస్సలు మాట్లాడనీయకుండా అడ్డుకోవడం ద్వారా వైసీపీ కూడా ప్రజల్లో చులకన అవుతోంది. విపక్షానికి తక్కువ సీట్లు వచ్చినంత మాత్రాన పూర్తిగా అడ్డుకోవాలా అన్న వాదన వినిపిస్తోంది. అదే సమయంలో టీడీపీ లేవనెత్తిన ప్రజా సమస్యలపై చర్చకు అంగీకరించకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల్ని నిత్యం సస్పెండ్ చేయడం ద్వారా ప్రజల్లోకి వైసీపీ తప్పుడు సంకేతాలు పంపుతోంది. తద్వారా వైసీపీ కూడా డిఫెన్స్ లో పడాల్సిన పరిస్ధితులు ఎదురవుతున్నాయి. అయినా వైసీపీ ఏమాత్రం లెక్క చేసేందుకు సిద్ధంగా లేనట్లే కనిపిస్తోంది.