ట్విస్ట్, రాజీనామాలు అంతా తూచ్! ఆదినారాయణ రెడ్డి ఆవేశం: టీడీపీ, అవును... ఆది
అమరావతి: తెలుగుదేశం పార్టీ నేత, మంత్రి ఆదినారాయణ రెడ్డి చేసిన ప్రకటనపై టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ ఓ టీవీ ఛానల్తో స్పందించారు. ఆయన ఆవేశపడి ప్రకటన చేసినట్లుగా ఉన్నారని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమేనని, పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.
ఏపీ ప్రయోజనాల కోసం తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తున్నారని, టీడీపీ కూడా కలిసి రావాలని వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర సందర్భంగా చెప్పారు. వెంటనే మంత్రి ఆదినారాయణ స్పందించారు. సై అంటే సై అన్నారు. వారి కంటే నెల రోజుల ముందే తాము రాజీనామా చేస్తామని చెప్పారు.
సంచలన ప్రకటన కానీ
ఆదినారాయణ రెడ్డి సంచలన ప్రకటన చేసి విషయం తెలిసిందే. తాము జగన్లా ఏప్రిల్ 6 వరకు వేచి చూడమని, మార్చి 5 వరకే తమ గడువు ఉందని, అప్పటిలోగా కేంద్రం తమ 19 డిమాండ్లు నెరవేర్చకుంటే అదే రోజు కేంద్రమంత్రులు రాజీనామా చేస్తారని, బీజేపీతో తెగదెంపులు చేసుకుంటామని చెప్పారు. అయితే ఆదినారాయణ రెడ్డి ప్రకటనను టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ను ఓ విధంగా తప్పుబట్టారు.
అవసరమైతే రాజీనామాలు
రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. రాజీనామాలపై తమ పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయిస్తారని చెప్పారు. తాము పార్టీ తరఫున ప్రకటన చేయలేదని స్పష్టం చేశారు. అవసరమైతే రాజీనామాలకు కూడా సిద్ధమని, కానీ ఆ నిర్ణయం ఇంకా తీసుకోలేదని అభిప్రాయపడ్డారు. ఏది ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో తమ పార్టీ అధినేత నిర్ణయిస్తారని చెప్పారు.
ఆవేశంలో చెప్పారు, మేమూ అంగీకరిస్తున్నాం
ఆదినారాయణ రెడ్డి ఏదో ఆవేశంలో చెప్పారని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. కేంద్రం ఏపీకి సరైన సాయం చేయలేదు కాబట్టి ఆయన అభిప్రాయంతో తాము కూడా ఏకీభవిస్తున్నామని, ప్రజలు కూడా ఓకే చెబుతారని అన్నారు. కేంద్రం నుంచి సరైన సాయం లేనందునే ఆయన అలా మాట్లాడారని చెప్పారు.
చివరి అస్త్రం, జగన్ డ్రామా
రాజీనామాలు తమ చివరి అస్త్రం మాత్రమేనని రాజేంద్రప్రసాద్ చెప్పారు. అన్ని అంశాలు చంద్రబాబు చెబుతారన్నారు. తాము రాజీనామాల విషయంలో వైసీపీతో పోటీ పడటం లేదని చెప్పారు. అసలు, తమ పార్టీ ఎంపీలు పార్లమెంటు వేదికగా ఉద్యమం చేయడం వల్లే వైసీపీ ఇరకాటంలో పడి రాజీనామా డ్రామాను తెరపైకి తెచ్చిందని ఆరోపించారు.
కీలక ప్రకటన.. ఆది వ్యక్తిగతం
అసలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల క్రితమే రాజీనామాలు చేస్తామని ప్రకటన చేసిందని, ఇప్పటి వరకు ఎందుకు చేయలేదని రాజేంద్ర ప్రసాద్ ప్రశ్నించారు. ఇలాంటి కీలక ప్రకటనలను ఆదినారాయణ ఆవేశంలో చేశారని, అది ఆయన వ్యక్తిగతమని చెప్పారు. తమకు రాజీనామాలు లెక్క కాదని, బీజేపీని ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు.
చంద్రబాబు మిస్టర్ క్లీన్, ఎవరికీ భయపడరు
చంద్రబాబు కేంద్రానికి భయపడుతున్నారన్న విమర్శలను రాజేంద్రప్రసాద్ కొట్టి పారేశారు. ఆయన మిస్టర్ క్లీన్ అని, ఎవరికీ భయపడరని తేల్చి చెప్పారు. ఏపీకి ఏది అవసరమో, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి, ఎలా ముందుకు వెళ్లాలనే విషయం చంద్రబాబుకు తెలుసునని, సమయాన్ని బట్టి తమ అధినేత నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
పార్టీకి సంబంధంలేదు
తమ పార్టీ కేంద్రమంత్రులు రాజీనామా చేస్తారని ప్రకటన చేసిన ఆదినారాయణ రెడ్డి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని చెప్పారు. మార్చి 5 డెడ్ లైన్ కాదని చెప్పారు. నేను చేసిన వ్యాఖ్యలకు పార్టీతో సంబంధం లేదని తేల్చి చెప్పారు.