టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు అరెస్ట్ - కుమారుడితో సహా..!!
టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయన్నపాత్రుడును పోలీసులు అరెస్ట్ చేసారు. గురువారం తెల్లవారుజామున అయ్యన్నపాత్రుడి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ఇంటి గోడ కూల్చివేత అంశంలో ఫోర్జరీ పత్రాలుయ సమర్పించారని అయ్యన్నపై అభియోగాలున్నాయి. ఈ కేసులో మొదటి నిందితుడిగా అయ్యన్నపాత్రుడు, రెండో నిందితుడిగా విజయ్, మూడో నిందితుడిగా రాజేష్ ఉన్నారు.అయ్యన్నకు నోటీసులు అందజేసి అరెస్టు చేశారు. ఆయన కుమారుడు చింతకాయల రాజేశ్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐడీ పోలీసులు అయ్యన్నపై పలు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
అయ్యన్నను అరెస్ట్ చేసేందుకు పోలీసులు వచ్చారని తెలియటంతో, ప్రతిఘటించేందుకు స్థానికులు మద్దతుగా అయ్యన్న నివాసానికి చేరుకున్నారు. తన భర్తతో పాటుగా తన కుమారుడికి ప్రాణ హాని ఉందని అయ్యన్న సతీమణి పద్మావతి ఆవేదన వ్యక్తం చేసారు. కనీసం దుస్తులు కూడా మార్చుకోనీయకుండా పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని పద్మావతి ఆరోపించారు. కాళ్లకు చెప్పులు వేసుకోనీయకుండా తీసుకెళ్లారని వివరించారు. మూడేళ్లుగా తమ కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ మండిపడ్డారు. అయ్యన్న అరెస్ట్ పైన టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ద్రరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటని నిలదీస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు దీని పైన స్పందించారు.
మూడేళ్లుగా అయ్యన్నను వేధిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే పదికి పైగా కేసులు పెట్టారని, విజయ్ కేసులో హైకోర్టు తప్పు బట్టినా పోలీసుల తీరులో మార్పు రావటం లేదని దుయ్యబట్టారు. దొంగల్లా పోలీసులు ఇళ్ల మీద అరెస్ట్ లు చేయటం ఎప్పుడైనా చూశామా అంటూ ప్రశ్నించారు. ఇప్పటికే అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ పైన కేసు నమోదు అయింది. సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి సీఐడీ సైబర్ విభాగం పోలీసులు నోటీసులు ఇచ్చారు. దీని పైన విజయ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు ఆయన కుమారుడు రాజేశ్ ను పోలీసులు అరెస్ట్ చేసారు.
టీడీపీ నేత అయ్యన్న పాత్రుడుని అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ pic.twitter.com/GqV8Ot1IOV
— oneindiatelugu (@oneindiatelugu) November 3, 2022