పవన్.. ఏంటీ తమాషా? ఎవరి మెప్పుకోసం ఇలా? అంత ఖర్మ లోకేశ్కేంటి?: వర్ల రామయ్య ఫైర్
అమరావతి: మొన్నటి వరకు టీడీపీతో సఖ్యతగా ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేయడం సబబు కాదని టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ది నిలకడలేని మనస్తత్వమని, ఈ విషయం సినీ ప్రపంచానికి, రాజకీయ నాయకులకు, అభిమానులకు, ప్రజలందరికీ తెలుసునని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన నమ్మేసి ఎదుటివాళ్లపై బురదచల్లకూడదన్నారు.

పవన్ ఎవరి మెప్పుకోసం ఇలా...
‘మిస్టర్ పవన్ కల్యాణ్.. ఎవరి మెప్పు కోసం మీరు ఈవిధంగా మాట్లాడుతున్నారు? ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. శేఖర్ రెడ్డి అవినీతిలో నారా లోకేశ్ కు భాగం ఉందని మోడీగారు మీ చెవిలో చెప్పారా? లేదంటే నువ్వు ఏపీకి వెళ్లి బాబును, టీడీపీని తగులుకో అని మోడీగారు సలహా ఇచ్చారా? ఏంటీ ఈ తమాషా?..' అని వర్ల రామయ్య ప్రశ్నించారు. ఎవరో ఏదో చెప్పినంత మాత్రాన నమ్మేసి ఎదుటివాళ్లపై బురదచల్లకూడదన్నారు.

లోకేశ్కి అంత ఖర్మేం పట్టింది?
ఎవరో ఏదో అనుకుంటుంటే విని మంత్రి నారా లోకేశ్ పై అభాండాలు వేస్తావా? అవినీతికి పాల్పడాల్సిన ఖర్మ లోకేశ్కి ఏం పట్టింది? అని టీడీపీ నేత వర్ల రామయ్య పవన్ కళ్యాణ్ను ప్రశ్నించారు. ‘నీ గురించి నేను కూడా చాలా విన్నాను.. చెప్పనా? కానీ నేను నీలా మాట్లాడను. ఆధారాలు లేకుండా ఎలాంటి ఆరోపణలు చేయను అని అన్నారు. పవన్ కళ్యాణ్ది నిలకడలేని మనస్తత్వమని, ఈ విషయం సినీ ప్రపంచానికి, రాజకీయ నాయకులకు, అభిమానులకు, ప్రజలందరికీ తెలుసునని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.

నీ కలలు నెరవేరాలి కదా.. జాగ్రత్త...
‘ఆరోపణలు చెయ్యాలంటే ఒక ఎవిడెన్స్ కావాలి తమ్ముడూ( పవన్ కల్యాణ్)! తప్పు నాయనా! అలా మాట్లాడకూడదు. పైకి రావాల్సిన వాడివి. చాలా ఆశలున్నాయి నీకు. చాలా ఊహించుకుంటున్నావు నువ్వు. నీ కలలు నెరవేరాలంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ అన్న మెగాస్టార్ ఏమయ్యాడు బాబు (పవన్ కల్యాణ్)!.. ' అని వర్ల రామయ్య పవన్ కళ్యాణ్కు రామయ్య హితవు పలికారు.

ఎన్నిసార్లు చూశానో, మొన్ననే పారేశా...
పవన్ కళ్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది' సినిమాను ఎన్నిసార్లు చూశానో తనకే తెలియదని, అలాంటిది ఆ సీడీని మొన్ననే బయట పారేశానని టీడీపీ నేత వర్ల రామయ్య తెలిపారు. తన కారులో కూడా ఆ సినిమా సీడీ ఉండేదని, అయితే ఏంటీ ఈ కుర్రాడు (పవన్ కల్యాణ్) ఇలా అసంబద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు అనుకుని, ఆ సీడీని తన కారులోంచి తీసి బయట పారేశానని ఆయన పేర్కొన్నారు.

గాలికబుర్లు పోగుచేసి మాట్లాడకు...
నారా లోకేశ్ పై ఆరోపణలు చేసి.. ఆ తర్వాత ‘వాళ్లెవరో చెప్పారు..అక్కడ విన్నా..ఇక్కడ విన్నా..' అని పవన్ కళ్యాణ్ మాట్లడడం సబబు కాదన్నారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. లోకేశ్, చంద్రబాబు ప్రభుత్వంపై తొందరపడి చేసిన వ్యాఖ్యలను పవన్ వెనక్కి తీసుకోవాలని ఆయన సూచించారు. ‘చంద్రబాబు వెంటే నడుస్తా, మోడీ మెడలు వంచైనా సరే, ఏపీకి ప్రత్యేక హోదా సాధిద్దామని నువ్వు (పవన్ కల్యాణ్) చెప్పాలి. మిస్టర్ పవన్ కల్యాణ్..ఇప్పటికైనా నీ దగ్గర వాస్తవాలు, ఆధారాలు ఉంటే మాట్లాడాలి తప్ప, గాలి కబుర్లు పోగుజేసి మాట్లాడొద్దు..' అని రామయ్య హితవు పలికారు.












Click it and Unblock the Notifications