దిగ్విజయ్పై టిడిపి సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
హైదరాబాద్: కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్పై తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర శాసనసభ్యులు శనివారం సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఈ నోటీసును వారు శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కార్యాలయంలో ఇచ్చారు. రాష్ట్ర శాసనసభను కించపరిచే విధంగా, శాసనసభ కార్యకలాపాలను ప్రభావితం చేసే విధంగా మాట్లాడారని ఆరోపిస్తూ వారు ఈ నోటీసు ఇచ్చారు.
బిఎసి జరుగుతుందని, సోమవారం తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వస్తుందని చెప్పడానికి దిగ్విజయ్ సింగ్ ఎవరని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు గాలి ముద్దుకృష్ణమ నాయుడు ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి అర్థరాత్రి వరకు పనిచేయాల్సిన అవసరం ఏమి వచ్చిందని ఆయన అడిగారు. తెలంగాణ బిల్లును వెనక్కి పంపితేనే స్పీకర్ నాదెండ్ల మనోహర్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదులు అవుతారని ఆయన అన్నారు

పార్టీ వ్యవహారాలు చూసుకోవాల్సిన దిగ్విజయ్ సింగ్ శాసనసభ కార్యకలాపాలపై ఎలా మాట్లాడుతారని ఆయన ప్రశ్నించారు. విభజనపై ఏ హోదాలో దిగ్విజయ్ గవర్నర్ నరసింహన్తో మాట్లాడుతారని ఆయన అడిగారు. వేర్పాటువాదానికి హైదరాబాద్ వచ్చిన దిగ్విజయ్ సింగ్కు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ విందు ఇవ్వడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు.
దిగ్విజయ్ సింగ్ తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన విమర్శించారు. తమ ప్రజల రక్తం, మాంసం దిగ్విజయ్ సింగ్కు రుచిగా ఉన్నట్లుందని ఆయన అన్నారు. తమ ప్రాణాలు తీసి, రాష్ట్రాన్ని అగ్నిగుండం చేసి దిగ్విజయ్ సింగ్ పైశాచిక ఆనందం పొందుతారా అని అడిగారు.












Click it and Unblock the Notifications