E20: వాహనదారులకు ఊరట- పెట్రోల్లో ఇథనాల్ పెంపుపై కేంద్రం క్లారిటీ..!
పెట్రోల్ లో ఇథనాల్ (Ethanol Blending) కలపడంపై దేశవ్యాప్తంగా వాహనదారుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీని వల్ల తమ వాహనాలు పాడైపోతున్నాయని, మైలేజ్ కూడా తగ్గిపోతుందనే ఫిర్యాదులు వస్తున్నాయి. అయినా కేంద్రం మాత్రం పెట్రోల్ లో ఇథనాల్ (E20) కలిపే విషయంలో వెనకడుగు వేసే ప్రశ్నే లేదని చెప్తూ వస్తోంది. కానీ ఇవాళ పెట్రోలియం శాఖ సహాయమంత్రి సురేశ్ గోపీ (suresh gopi) మాత్రం పెట్రోల్ లో ఇథనాల్ మిక్స్ విషయంలో ఓ కీలక ప్రకటన చేశారు.
పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతానికి మించి పెంచే ప్రతిపాదన ఏదీ ప్రస్తుతానికి తమ వద్ద లేదని కేంద్రమంత్రి సురేష్ గోపీ తేల్చిచెప్పేశారు. అలాగే వాణిజ్య అవసరాల కోసం డీజిల్లో ఇథనాల్ను కలపాలనే ఆలోచన కూడా తుది నిర్ణయ దశకు రాలేదని తెలిపారు. రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా సురేష్ గోపి ఈ విషయాన్ని సభకు లిఖితపూర్వకంగా సమర్పించారు.
భవిష్యత్తులో ఇథనాల్ కలిపే శాతాన్ని మరింతగా పెంచాలనే ప్రతిపాదన చేస్తే అది కేవలం సమగ్ర శాస్త్రీయ పరిశీలన ఆధారంగా మాత్రమే జరుగుతుందని సురేష్ గోపి పేర్కొన్నారు.

అలాగే వాహనాల ఇంజన్ల అనుకూలత పరిశీలించడం, వివిధ భాగస్వామ్య పక్షాలతో లోతైన సంప్రదింపులు జరపడం, దేశీయంగా తగినంత ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం లభ్యత ఆధారంగానే వీటిపై భవిష్యత్తు నిర్ణయాలు తీసుకుంటామని సురేష్ గోపీ స్పష్టం చేశారు. పెట్రోల్లో బయో ఇంధనం వినియోగాన్ని పెంచేందుకు తదుపరి దశ చర్యలలో భాగంగా, ఇటీవల జూన్ నెలలో కేంద్ర ప్రభుత్వం 22 శాతం నుండి 30 శాతం వరకు ఇథనాల్ కలిపిన పెట్రోల్కు ఎక్సైజ్ సుంకం నుంచి మినహాయింపు కల్పించింది. దీంతో ఇథనాల్ పరిమితిని త్వరలోనే పెంచుతారనే ఊహాగానాలు వచ్చాయి. కానీ ఇప్పటికే ఎదుర్కొంటున్న వ్యతిరేక నేపథ్యంలో కేంద్రం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications