ఇక ఎల్పీజీ వంటగ్యాస్ లో కూడా ఇథనాల్ మిక్సింగ్: కేంద్రం ప్లాన్: కొత్త స్టవ్ లు
పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమంపై ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. పాత వాహనాల మైలేజ్ తగ్గడమే కాకుండా, ఇంజిన్ దెబ్బతింట్లోందనే ఆందోళనలు వ్యక్తమౌతోన్నాయి. ఇథనాల్కు ఉన్న స్వభావం వల్ల అది గాలిలోని తేమను చాలా సులభంగా గ్రహిస్తుంది. దీనివల్ల వాహనాల పెట్రోల్ ట్యాంకులు, ఫ్యూయల్ ఇంజెక్టర్లు, పంపులు దెబ్బతింటోన్నాయని, అవన్నీ తుప్పు పడుతున్నాయనే వాదనలు వినిపిస్తోన్నాయి.
ఈ పరిణామాల మధ్య కేంద్రం మరో నూతన నిర్ణయానికి తెర తీసింది. వంట గ్యాస్ లో కూడా ఇథనాల్ ను కలపాలని ప్రతిపాదించింది. దీనిపై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఓ నూతన విధానాన్ని రూపొందిస్తోన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఎల్పీజీ దిగుమతి భారం గణనీయంగా తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది. ఇథనాల్ తో కూడిన ఎల్పీజీ విధానానికి సంబంధించిన ప్రతిపాదనలను రాబోయే సెప్టెంబర్ నాటికి సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రస్తుతం దేశంలో ఎల్పీజీ వాడకం భారీగా ఉంటోంది. దాదాపు 90 శాతం దిగుమతుల మీదే ఆధారపడాల్సి రావడం వల్ల ఖజానాపై భారం అధికమౌతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ప్రభావం ఎల్పీజీ సరఫరాపై తీవ్రంగా పడింది కూడా. ఇదివరకు వంటగ్యాస్ ను ప్రాధాన్యత క్రమంలో వినియోగదారులకు అందజేయాల్సిన పరిస్థితిని చవిచూసింది కేంద్రం. అదే సమయంలో కమర్షియల్ వంటగ్యాస్ రేట్లను కూడా కనీవినీ ఎరుగని విధంగా పెంచాల్సొచ్చింది. ప్రస్తుతం దేశంలో వాణిజ్య అవసరాలకు వినియోగిస్తోన్న ఎల్పీజీ సిలిండర్ రేట్లు రూ.3,000 పైమాటే.
వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్రం తాజా ప్రతిపాదనలను తెరమీదికి తీసుకొచ్చింది. గృహావసరాల కోసం వినియోగించే ఎల్పీజీ వంటగ్యాస్ లో ఇథనాల్ ను కలపాలన అంశంపై చర్చలు సాగిస్తోంది. ఎల్పీజీ కి ప్రత్యామ్నాయంగా ఇథనాల్ను తక్కువ ధరకే వంట గ్యాస్ రూపంలో అందుబాటులోకి తీసుకురావడం ద్వారా సాధారణ పౌరులకు ఆర్థిక ఊరటనివ్వాలని కేంద్రం ఆశిస్తున్నట్లు చెబుతున్నారు.
ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గృహావసరాల కోసం ప్రత్యేకంగా ఇథనాల్ ఆధారిత స్టవ్లను కూడా పరీక్షించే ప్రక్రియ ప్రారంభమైందని అంటున్నారు. భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తూ వినియోగదారులకు అనుకూలంగా ఉండేలా ఈ స్టవ్ లను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా ఈ దిశగా క్షేత్రస్థాయిలో పరిశోధనలను ముమ్మరం చేశాయని, సెప్టెంబర్ నాటికి దీనికి సంబంధించిన విధానాలను రూపొందించే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇథనాల్ తో కూడిన ఎల్పీజీ వినియోగాన్ని పెద్ద ఎత్తున ప్రజలకు చేరువ చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని సబ్సిడీలను కూడా ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. దేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం ఇథనాల్లో సుమారు 11 బిలియన్ లీటర్లు పెట్రోల్ బ్లెండింగ్ కోసం వినియోగమవుతోంది. మరో 3.5 బిలియన్ లీటర్లను ఫార్మా, రసాయన పరిశ్రమలు వాడుకుంటున్నాయి. మిగిలిన ఏడు బిలియన్ లీటర్ల ఇథనాల్ వృధా అవుతోందని, దీన్ని గృహావసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల దిశగా మళ్లించాలనేది ప్రభుత్వం ఉద్దేశం.














Click it and Unblock the Notifications