టీడీపీని వణికిస్తోన్న కర్నూల్ పాలిటిక్స్ : వైసీపీ వైపు చూస్తోన్న ఏరాసు
రెండు కత్తులు ఒకే ఒరలో ఇమడడం ఎంత కష్టమో..! భిన్నధృవాల లాంటి ఇద్దరు నేతలు ఒకే పార్టీలో ఇమడడం కూడా అంతే కష్టం. ఏపీలో టీడీపీ రాజకీయాలను గమనిస్తే ఇదే మాట నిజమనిపించకమానదు. ప్రత్యర్థి పార్టీని ఖాళీ చేసే ఉద్దేశంతో టీడీపీ చేస్తున్న ఆపరేషన్ ఆకర్ష్ అంతర్గతంగా బెడిసికొడుతున్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా కర్నూలు రాజకీయాల్లో ఈ సమస్య ముదిరి పాకాన పడిందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.
అంతేకాదు.. వైసీపీ నుంచి పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యేల వల్ల తమలో తమకే పోటీ ఏర్పడే పరిస్థితి రావడంతో రాజకీయ భవిష్యత్ దృష్ట్యా వైసీపీలోకి వెళ్లడమే బెటర్ అనే ఆలోచనలో ఆయా నేతలు ఉండడం టీడీపీని ఇప్పుడు కలవరపాటుకు గురిచేస్తుంది. కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు టీజీ వెంకటేష్, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఈ జాబితాలో ముందువరుసలో ఉన్నట్టుగా సమాచారం. ఇప్పటికే పార్టీ మార్పు అంశంపై ఇద్దరు నేతలు వైసీపీతో సంప్రదింపులు జరుపుతున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
తాజాగా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్దా రాజశేఖర్ రెడ్డి వైసీపీని వీడి టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే.. శ్రీశైలం నియోజకవర్గ పరిధిలో ఏరాసు ప్రాబల్యాన్ని తగ్గించేందుకే ఎమ్మెల్యే బుడ్దా రాజశేఖర్ ని పార్టీలోకి తీసుకొచ్చారని భావిస్తున్నారట ఏరాసు. దీంతో పాటు త్వరలోనే మరో నేత టీజీ వెంకటేష్ కి కూడా బ్రేక్ వేయాలనే ఆలోచనలో టీడీపీ వర్గాలున్నాయన్న వాదన వినిపిస్తోంది. జరుగుతున్న పరిమాణాలను గమనిస్తున్న నేతలిద్దరు పార్టీలో తమకు పొగబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న నిర్ధారణకు వచ్చినట్టుగా సమాచారం.
అభివృద్ది విషయంలో పలుమార్లు.. టీడీపీని బహిరంగగానే విమర్శించిన టీజీ వెంకటేష్ పట్ల ఉద్దేశపూర్వకంగానే పార్టీ ఈ చర్యలకు పాల్పడుతున్నట్టుగా ఆయన బలంగా నమ్ముతున్నారని తెలుస్తోంది. కాగా..! అభివృద్ది అంతా అమరావతిలోనే చేస్తున్నారంటూ రాయలసీమను గాలికి వదిలేసారని ఆయన చాలాసార్లు విమర్శలకు దిగిన విషయం తెలిసిందే. ఏదేమైనా ఒకవేళ ఈ ఇద్దరు నేతలు గనుక వైసీపీ తీర్థం పుచ్చుకుంటే.. మిగతా జిల్లాల్లోను దీని ప్రభావం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.